ఏపీకి కష్టాలే... రేపు మరో అల్పపీడనం
రానున్న 24 గంటల్లో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడబోతున్నట్లు అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇప్పటికే వర్షాలకు, వరదలకు అతలాకుతలమైన రెండు తెలుగు రాష్ట్రాలకు ఇది ఒకరకంగా బ్యాడ్ న్యూస్ అని చెప్పొచ్చు. బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనం రెండురోజుల్లో తీవ్రమైన వాయుగుండంగా మారుతుందని, దీని ప్రభావంతో పశ్చిమ బెంగాల్, ఒడిసా, చత్తీస్ గడ్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. దీంతోపాటు రానున్న మూడు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా విస్తారమైన వర్షాలు కురుస్తాయని, ఈనెల 20వ తేదీ నుంచి అక్టోబరు మొదటివారం వరకు ఇవే వర్షాలు కొనసాగుతాయని వాతావరణ కేంద్రం ప్రకటించింది.
తగ్గుముఖం పట్టిన గోదావరి వరద
రెండురోజులుగా ఎగువ రాష్ట్రాల నుంచి కురుస్తున్న వర్షాలతో గోదావరికి పోటెత్తుతున్న వరద ప్రస్తుతం కాస్తంత తగ్గుముఖం పట్టింది. నిన్న ఒక్కరోజే దాదాపు 15 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రస్తుతం ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరికను జారీచేశారు. గోదావరిలో నిల్వ ఉన్న నీరు 10 లక్షల క్యూసెక్కులకు తగ్గితేకానీ లంక గ్రామాలకు ముప్పు తప్పినట్లని అధికారులు తెలిపారు. నిన్న కూడా రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి జల్లులు కురిశాయి. అయితే మరికొన్ని జిల్లాల్లో మాత్రం ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి నాలుగు డిగ్రీలు అదనంగా నమోదయ్యాయి.

తేలికపాటి జల్లులు పడతాయి
శుక్రవారం చిత్తూరు, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో తేలికపాటి జల్లులు కురుస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. వరదలవల్ల తీవ్రంగా నష్టపోయిన విజయవాడను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్వయంగా దగ్గరుండి సహాయక చర్యలను పదిరోజులపాటు పర్యవేక్షించారు. ఇంట్లో వస్తువులకు సాధ్యమైనంత త్వరగా బీమా పరిహారం ఇప్పించేందుకు కృషిచేస్తానని, అలాగే పంట కోల్పోయిన రైతులకు అదనపు పరిహారం అందిస్తామని సీఎం హామీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications