రాసలీలలు, రహస్య వీడియోలు: రాజమండ్రి కీచక కరస్పాండెంట్ అరెస్ట్
అమరావతి: పది, ఇంటర్ ఫెయిల్ అయిన విద్యార్థునులపై లైంగిక వేధింపులకు పాల్పడి, రహస్యంగా వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేసిన చైతన్య అకాడమీ కరస్పాండెంట్ను రాజమహేంద్రవరం టూటౌన్ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. గత పదిరోజుల నుంచి కరస్పాండెంట్ గుత్తుల శ్రీధర్ పరారీలో ఉన్నారు.
గుత్తల శ్రీధర్ను ఎలాగైనా పట్టుకోవాలనే ఉద్దేశ్యంతో తూర్పుగోదావరి ఎస్పీ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ బృందం గుత్తల శ్రీధర్ను చివరకు తిరుపతిలో అదుపులోకి తీసుకుంది. ఈ పది రోజులు అతడు గుంటూరు, విజయవాడ, తిరుపతి తదితర ప్రాంతాల్లో తిరిగినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.
మరికాసేపట్లో నిందితుడిని పోలీసులు కోర్టులో హాజరుపరచనున్నారు. రాజమండ్రిలోని కోటిపల్లి బస్టాండ్ ప్రాంతంలోని టూటౌన్ పోలీస్ స్టేషన్కు అతి సమీపంలో కొన్నేళ్లుగా నిర్వహిస్తున్న గుత్తుల శ్రీధర్ చైతన్య అకాడమీ పేరుతో డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సెంటర్ను నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో విద్యార్థులను పదో తరగతి పాస్ చేయిస్తానని చెబుతూ లొంగదీసుకున్నాడు.
ముఖ్యంగా రాజమండ్రి గ్రామీణ ప్రాంతాల్లోని పేద విద్యార్థులను అతను బ్లాక్ మెయిల్ చేసి లొంగదీసుకుని వారిపై లైంగిక వేధింపులకు పాల్పడేవాడు. అకాడమీలోనే విద్యార్థునులతో జరిపిన రాసలీలలను రహస్య కెమెరాలతో చిత్రీకరించి ఆ తర్వాత వారిని డబ్బు కోసం బ్లాక్ మెయిల్ చేసేవాడని ఆరోపణలు వచ్చాయి.
ఆ వీడియోలను బయటకు లీక్ చేస్తానంటూ విద్యార్ధినులను బెదిరించి లక్షలాది రూపాయలు వసూలు చేసేవాడు. చైతన్య అకాడమీలో నిందితుడు గుత్తుల శ్రీధర్తో పాటు అతడి బావమరిదికి కూడా పాట్నర్షిప్ ఉంది. అయితే తన బావమరిది శివకు అడిగినంత డబ్బు ఇవ్వకపోడవంతో ఈ రాసలీలల విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చాడు.
నిందితుడు జరిపిన రాసలీలకు సంబంధించి వీడియోలను మీడియాకు అందించాడు. వీడియోలు బయటకు వచ్చినా అకాడమీ కరస్పాడెంట్పై ఫిర్యాదు చేసేందుకు బాధితులకు సంబంధించిన ఎవరూ ముందుకు రాలేదు. దీంతో ఏపీ బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు నురుకుర్తి దుర్గాప్రసాద్ యాదవ్, విద్యార్థి సంఘాల నాయకులు అర్బన్ ఎస్పి హరికృష్ణకు ఫిర్యాదు చేశారు.
విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న కరస్పాండెంట్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో ఎస్పి సౌత్ జోన్ డిఎస్పీ శ్రావణికి రిఫర్ చేశారు. దీంతో టూటౌన్ సిఐ నాగేశ్వరరావు కరస్పాండెంట్ శ్రీధర్పై ఫిబ్రవరి 28న కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడు శ్రీధర్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
కాగా, మీడియాకు విడుదలైన వీడియోలపై బాధితుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. కరస్పాడెంట్ శ్రీధర్ బాధితుల్లో తమ పిల్లలు ఉన్నారా? అంటూ ఆరా తీస్తున్నారు. ఈ కీచకుడి చేతుల్లో ఎవరెవరి పేర్లు బయటకు వస్తాయనో తల్లిదండ్రులు ఆందోళనతో ఉన్నారు.