పిల్లల్ని పరీక్షించిన రాజయ్య, రూ50వేలు ఇచ్చిన లోకేష్
హైదరాబాద్: తెలంగాణ ఉప ముఖ్యమంత్రి రాజయ్య యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులను పరామర్శించారు. మెదక్ జిల్లా మాసాయిపేట వద్ద పాఠశాల బస్సును రైలు ఢీకొన్న ప్రమాదంలో పలువురు విద్యార్థులు గాయపడిన విషయం తెలిసిందే. ఆసుపత్రిలో ఉన్న చిన్నారులను రాజయ్య కలిశారు.
అనంతరం విలేకరులతో మాట్లాడారు. పిల్లలు బాగా కోలుకుంటున్నారన్నారు. త్వరలోనే 16 మందిని డిశ్చార్జ్ చేస్తామన్నారు. డిశ్చార్జ్ అయిన విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించేందుకు కామారెడ్డి నుంచి ఒక వైద్యుడిని నియమిస్తామన్నారు. ఏమాత్రం ఎమర్జన్సీ ఉన్నా పిల్లలను మళ్లీ యశోదా ఆసుపత్రికి తరలించేలా సదరు వైద్యుడు జాగ్రత్తలు తీసుకుంటారన్నారు.
తరుణ్, వైష్ణవిల పరిస్థితి మాత్రం విషమంగా ఉన్నట్లు చెప్పారు. ప్రశాంత్, వరుణ్ల పరిస్థితి మెరుగైందన్నారు. పిల్లల ఆరోగ్యం విషయంలో ఎలాంటి దాపరికం లేదన్నారు. పిల్లల్ని క్షేమంగా ఇంటికి చేర్చే బాధ్యత ప్రభుత్వానిదే అన్నారు. విద్యార్థులు పూర్తిగా కోలుకునే వరకు వైద్య చికిత్స అందిస్తామన్నారు. కాగా, స్వయంగా డాక్టర్ అయిన రాజయ్య పిల్లల ఆరోగ్య పరిస్థితిని పరీక్షించారు.
నారా లోకేష్ పరామర్శ
యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులను తెలుగుదేశం పార్టీ యువ నేత నారా లోకేశ్ పరామర్శించారు. ఆయన వెంట పార్టీ తెలంగాణ ఎమ్మెల్యే రేవంత్ కూడా ఉన్నారు. పిల్లల కుటుంబ సభ్యులను ఓదార్చారు. వారి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. గాయపడ్డ బాధిత కుటుంబాలకు లోకేష్ రూ.50వేల చొప్పున అందించారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడారు. బాధిత కుటుంబాలకు రూ.50వేలు ఇచ్చామన్నారు. మృతుల కుటుంబాలకు ఎల్లుండి రూ.లక్ష చొప్పున ఇస్తామన్నారు. బాధిత కుటుంబాల పిల్లలు ఎన్టీఆర్ మోడల్ స్కూల్లో చదువుకోవడానికి అవకాశమిస్తామన్నారు. బాధిత కుటుంబాలు ఆందోళన చెందవలసిన అవసరం లేదన్నారు.