కృష్ణయ్య టు పుష్పరాజ్, కేఈ దండయాత్ర: బాబుకు రాజ్యసభ షాక్
విజయవాడ: ఏపీ నుంచి టిడిపి తరఫున రాజ్యసభకు సుజనా చౌదరిని, టీజీ వెంకటేష్ను ఎంపిక చేశారు. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పైన పలువురు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. కాపుకు, బీసీలకు, మాలలకు న్యాయం చేయలేదని మండిపడుతున్నారు.
పార్టీకి పునాదిరాళ్లయిన బీసీలను టిడిపి మోసం చేసిందని స్వయంగా తెలంగాణ టిడిపి ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య ఆగ్రహం వ్యక్తం చేయగా, దళిత నేత పుష్పరాజ్ను పార్టీ వాడుకుని వదిలేశారని మాలమహానాడు మండిపడింది. పుష్పరాజ్ సైతం తనను నమ్మించి మోసం చేశారని వాపోయిన విషయం తెలిసిందే.
తమకు మొండి చేయి చూపారని కాపు నేతలు ఆగ్రహోద్రులవుతున్నారు. దీంతో రాజ్యసభ ఎన్నిక విషయమేమో గానీ, సంప్రదాయ మద్దతుదారులయిన బలహీనవర్గాలు టిడిపిపై మండిపడటం చర్చనీయాంశంగా మారింది. రాజ్యసభ అభ్యర్థుల ఎంపికలో టిడిపి నాయకత్వం బీసీలకు అన్యాయం చేసిందని ఆర్ కృష్ణయ్య అన్నారు.
టిడిపి దళితులు, బీసీలను నమ్మించి మోసం చేసిందని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు డాక్టర్ రత్నాకర్ ఆరోపించారు. పార్టీకి ఎప్పటినుంచో సేవ చేస్తున్న పుష్పరాజ్ కంటే రెండేళ్ల క్రితం కాంగ్రెస్ నుంచి వచ్చి చేరిన టీజీ వెంకటేష్ సీనియరా? పార్టీకి ఆయన చేసిన సేవ ఏమిటో చెప్పాలన్నారు.
బహిరంగ వేలంలో సీటు ఇచ్చారని ఆరోపించారు. టిడిపిలో బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరగదన్న వాస్తవం నిజమయిందన్నారు. రాష్ట్రంలో దళితులను బాబు ప్రభుత్వం అణచివేస్తోందన్నారు. మరోవైపు సీనియర్ నేత పుష్పరాజ్ సైతం.. నాయకత్వం తనను నమ్మించి మోసం చేసిందని, ఇప్పుడున్న పార్టీకి, ఎన్టీఆర్ నాటి పార్టీకి చాలా తేడా ఉందని, ఇప్పుడు డబ్బున్న వాళ్లకే ప్రాధాన్యం ఇస్తున్నారని వ్యాఖ్యానించారు.
మరోవైపు, కాపులకు చంద్రబాబు మొండిచేయి చూపారని కాపునాడు నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఇచ్చిన సీటును చూపించి ఈసారి తమకు మొండిచేయి చూపించారన్నారు. రాయలసీమ నుంచి బలిజలకు అవకాశం ఇవ్వాలని తాము చాలాకాలం నుంచి కోరుతున్నామని, అయినా రాయలసీమలో పెద్దగా బలం లేని వైశ్య వర్గానికి ప్రాతినిధ్యం కల్పించడం ఆశ్చర్యంగా ఉందన్నారు.
రాజ్యసభ షాక్, బాబుపై పుష్పరాజ్ సంచలనం: 'నన్ను గదిలో పెట్టి రాజకీయం'
టిడిపి కార్యాలయాన్ని ముట్టడించిన మాజీ మంత్రి కేఈ
టిడిపి రాజ్యసభ స్థానంపై టిడిపి నేత బీటీ నాయుడు ఆశలు పెట్టుకున్నారు. కానీ జిల్లాకే చెందిన టీజీ వెంకటేష్కు అది దక్కింది. తనకు సీటు దక్కకపోవడంపై బీటీ నాయుడు అసంతృప్తితో ఉన్నారు. మరోవైపు ఆయన వర్గం నేతలు ఆగ్రహంతో ఉన్నారు.
గురువారం ఉదయం కర్నూలులోని టిడిపి కార్యాలయాన్ని బీసీ నేతలు ముట్టడించారు. ఈ ముట్టడికి టిడిపి సీనియర్ నేతగానే కాకుండా, గతంలో చంద్రబాబు కేబినెట్లో పని చేసిన కేఈ ప్రభాకర్ నేతృత్వం వహించడం గమనార్హం. డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి సోదరుడైన ప్రభాకర్ తన సామాజిక వర్గం నేతలకు జరిగిన అన్యాయంపై కార్యాలయాన్ని ముట్టడించారని చెబుతున్నారు.