సాహితీవేత్త రాళ్లబండి కవితా ప్రసాద్ కన్నుమూత
హైదరాబాద్: ప్రముఖ సాహితీవేత్త, తెలంగాణ దళిత అభివృద్ధి సంస్థ సంయుక్త కార్యదర్శి రాళ్లబండి కవితా ప్రసాద్ కన్నుమూశారు. ఆయన వయస్సు 55 ఏళ్లు. హృద్రోగ సమస్యలతో బాధపడుతున్న ఆయన గత నెల 24వ తేదీన హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. అప్పటినుంచీ వెంటిలేటర్పై ఉంచి గుండె సంబంధ సమస్యలకు వైద్యం అందిస్తున్నారు. నిరంతరం డయాలసిస్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం కిడ్నీ కూడా ఫెయిల్ అయినట్టు గుర్తించారు.
కవితాప్రసాద్ మృతి పట్ల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు సంతాపం వ్యక్తం చేశారు. సాహితీ వేత్తల్లో ఆయన స్థానం సుస్థిరమైనదని కొనియాడారు. కవితా ప్రసాద్ అవధానానికి కొత్త నిర్వచనం ఇచ్చిన ఉత్తమ సాహితీవేత్త అని జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత సి.నారాయణరెడ్డి అన్నారు. సాహిత్య ప్రక్రియలు పుంజుకునేందుకు ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని తెలంగాణ ప్రభుత్వ సాంస్కృతిక సలహాదారు కేవీ రమణాచారి నివాళి అర్పించారు.
అవధానానికి ఆధునిక సొబగులు అద్దిన రాళ్లబండి కవితా ప్రసాద్ కృష్ణాజిల్లా గంపలగూడెం మండలం నెమలిలో 1961 మే 21న జన్మించారు. కవితా ప్రసాద్ నెమలిలో పదవ తరగతి వరకు చదివారు. తండ్రి కోటేశ్వరరాజు ప్రభుత్వ ఉపాధ్యాయుడు కావడంతో తరచూ బదిలీ అయ్యేవారు. ఈ క్రమంలో సత్తుపల్లిలో కవితా ప్రసాద్ డిగ్రీ చేశారు. అవధాన విద్య ఆరంభ వికాసాలపై ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పీహెచ్డీ చేశారు. అనంతర కాలంలో ఇదే వేదిక నుంచి గౌరవ డాక్టరేట్ని అందుకొన్నారు.

కవితాప్రసాద్ చిన్నప్పటి నుంచే సాంస్కృతిక రంగం పట్ల ఆసక్తి కనబరిచారు. అవధాన విద్య పట్ల మక్కువ పెంచుకొని జీవితకాలం ఆ ప్రక్రియలో రాణించారు. దాదాపు 500కి పైగా అవధాన సభలను ఆయన నిర్వహించారు. శతవధానం, ద్విశతవధానం, నవరసవధానం, అష్టావధానం తదితర విశిష్టమైన, అతి క్లిష్టమైన దశలను సమర్థంగా పరిచయం చేశారు. తెలుగు నేలపై గుబాళించిన ఈ ప్రాచీన సాహితీ ప్రక్రియలను ఎల్లలు దాటించారు. అమెరికాలోని తెలుగు భాషా, సాహితీ ప్రియులు ఆయన కోసం ప్రత్యేక వేదికలను ఏర్పాటుచేశారు. ఈ కృషిలో కొంత ఆయన జీవితకాలంలోనే గ్రంథస్థం అయింది.
ఒంటరి పూలబుట్ట, పద్మ మంటపం, అగ్నిహింస, ఇది కవి సమయం తదితర సంపుటులు వెలువరించారు. ఉమ్మడి రాష్ట్రంలో సుదీర్ఘ కాలం సాంస్కృతిక విభాగంలో అనేక హోదాల్లో సేవలు అందించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మ ప్రచార పరిషత్ కార్యదర్శిగా ఆయన పనిచేశారు. ఈ కాలంలో ‘సప్తగీతధామ', ‘కవిసార్వభౌమ' పేరిట వేంకటేశ్వర సంకీర్తనలను రచించి సీడీ రూపంలో అందించారు. దాదాపు పాతికేళ్ల తరువాత ప్రతిష్టాత్మకంగా జరిగిన మహాసభలకు సమన్వయకర్తగా వ్యవహరించారు.
ఆధునిక నృత్య రూపకాపై పంచకన్య, పంచకావ్యాలను రచించారు. ఈ రూపకాలను 24 గంటల్లోనే సిద్ధం చేసి ప్రముఖ నృత్యకారిణి మంజుభార్గవితో ప్రదర్శింపజేయడం అప్పట్లో సంచలనం సృష్టించింది.












Click it and Unblock the Notifications