పది లక్షల మందితో ఢిల్లీలో ప్రదర్శన: టిజి వెంకటేష్
న్యూఢిల్లీ: రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ఢిల్లీలో పది లక్షల మందితో ప్రదర్శన నిర్వహించనున్నట్లు రాయలసీమకు చెందిన రాష్ట్ర మంత్రి టిజి వెంకటేష్ చెప్పారు. కోస్తాంధ్రలో, రాయలసీమలో జరుగుతున్న ఆందోళనలు ఢిల్లీ నాయకుల దృష్టికి అంతగా రావడం లేదని, ఢిల్లీలో ప్రదర్శన చేస్తే ఢిల్లీ నాయకత్వం అర్థం చేసుకునే పరిస్థితి ఉంటుందని ఆయన బుధవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. అసెంబ్లీలో తెలంగాణ బిల్లు వీగిపోయినా రాష్ట్రాన్ని ఇచ్చే అధికారం పార్లమెంటుకు ఉంటుందా, లేదా అనే విషయంపై న్యాయనిపుణులను సంప్రదిస్తున్నామని, అలాంటి అవకాశం ఉంటే ఎలా ఎదుర్కోవాలనే విషయంపై ఆలోచన చేస్తామని ఆయన అన్నారు.
కాంగ్రెసు పార్టీ ఎన్నికల ప్రణాళికలో తెలంగాణ అంశాన్ని పెట్టలేదని, కేవలం ప్రతిపక్షాల మాటలతో విభజనకు ముందుకు వెళ్తోందని, అలా ముందుకు వెళ్లడం సరి కాదని ఆయన అన్నారు. సీమాంధ్రలో జరుగుతున్న ఉద్యమాలను కొద్దో గొప్పో తమ కాంగ్రెసు పార్టీ అధిష్టానం గుర్తించిందని, అందుకే రాష్ట్ర విభజన ప్రక్రియ నిలిచిపోయిందని ఆయన అన్నారు. రాష్ట్ర విభజనపై సీమాంధ్ర ప్రజలు, నాయకులు ఆలస్యంగా స్పందించారని, తెలంగాణ ప్రజలు, నాయకులు ముందుగా ప్రతిస్పందించారని, అందుకే ఈ పరిస్థితి వచ్చిందని ఆయన అన్నారు.
విభజన వల్ల మూడు ప్రాంతాలకు కలిగే ఇబ్బందుల గురించి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చెబుతున్నారని, అలా చెప్పడం తప్పేమీ కాదని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి తన పరిమితిలో చెప్పాల్సింది చెబుతున్నారని ఆయన అన్నారు. నూటికి నూరు శాతం ముఖ్యమంత్రి సమైక్యవాదేనని ఆయన అన్నారు. అందరినీ కలుపుకుని వెళ్లాలని కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ దిగ్విజయ్ సింగ్ అంటున్నారని, దాన్ని ఏ విధంగా అర్థం చేసుకుంటే ఆ విధంగా అర్థం చేసుకోవచ్చునని ఆయన అన్నారు.
ముఖ్యమంత్రి మాటలు పార్టీ అధిష్టానాన్ని ధిక్కరించడం కాదని, కాంగ్రెసు పార్టీలో ఉన్నంత ప్రజాస్వామ్యం ప్రపంచంలో ఎక్కడా లేదని ఆయన అన్నారు. మార్చిలోగా విభజన జరుగుతుందనే నమ్మకం లేదని ఆయన అన్నారు. ఢిల్లీ ప్రదర్శనకు పది లక్షల మంది వస్తేనే విభజనను ఎదుర్కోవడం సాధ్యమవుతుందని, వారం పది రోజులు ఢిల్లీలో ఉండడానికి సీమాంధ్ర ప్రజలు సిద్ధపడాలని ఆయన అన్నారు.