2024 ఎన్నికలకు జగన్ పర్ఫెక్ట్ వ్యూహం- ఆర్జీవీతో భేటీ: రెండు పార్టులుగా
అమరావతి: రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో రాబోతోన్న లేటెస్ట్ మూవీ.. వ్యూహం. ఏపీలో నెలకొన్న రాజకీయ పరిణామాలను కథాంశంగా చేసుకుని తెరకెక్కుతోందీ సినిమా. దాసరి కిరణ్ కుమార్ ఈ సినిమాను నిర్మిస్తోన్నారు. ఇదివరకు వంగవీటి సినిమాను నిర్మించింది ఆయనే. ఇటీవలే ఈ సినిమాలో నటిస్తోన్న పాత్రధారుల ఫొటోలను రామ్ గోపాల్ వర్మ విడుదల చేశారు.
ఇదివరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఆయన భార్య భారతిరెడ్డి పాత్రల ఫొటోలను రిలీజ్ చేశారాయన. వైఎస్ జగన్ పాత్రను తమిళ నటుడు అజ్మల్ పోషిస్తోన్నాడు. వైఎస్ భారతి క్యారెక్టర్లో మానస రాధాకృష్ణన్ నటిస్తోన్నారు. దీని తరువాత వ్యూహం సినిమాకు సంబంధించిన పలు వర్కింగ్ స్టిల్స్ను రామ్ గోపాల్ వర్మ.. తన అధికారిక ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేస్తూ వచ్చారు.

ఇటీవలే తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడి వర్కింగ్ స్టిల్ కూడా బయటికొచ్చింది. దీన్ని రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేశారు. ఎ క్యారెక్టర్ ఫ్రమ్ వ్యూహం అంటూ క్యాప్షన్ను జోడించారు. గెడ్డం, హెయిర్ స్టైల్, కాస్టూమ్స్.. ఇలా అన్ని విషయాల్లోనూ చంద్రబాబును స్ఫూరింపజేసేలా ఈ క్యారెక్టర్ను రామ్ గోపాల్ వర్మ తీర్చిదిద్దాడనేది ఫొటో చూస్తే తెలిసిపోతుంది.
ఈ దసరా నాటికి సినిమా విడుదలయ్యే అవకాశం ఉందనేది ఫిల్మ్ నగర్ టాక్. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి హఠాన్మరణం అనంతరం చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలను ఈ సినిమాలో ప్రస్తావించనున్నారు రామ్ గోపాల్ వర్మ. రాష్ట్ర విభజన, నవ్యాంధ్రలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం, జగన్ చేపట్టిన పాదయాత్ర, 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయాన్ని సాధించడం వంటి అంశాలను ఇందులో చేర్చారు.
ఈ పరిణామాల మధ్య రామ్ గోపాల్ వర్మ కొద్దిసేపటి కిందటే వైఎస్ జగన్తో భేటీ అయ్యారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయం ఈ సమావేశం ఏర్పాటైంది. వారిద్దరి మధ్య సుమారు గంటపాటు ఈ భేటీ కొనసాగింది. ఈ సందర్భంగా పలు అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. వ్యూహం సినిమా అప్డేట్స్ ఏమిటనేది రామ్ గోపాల్ వర్మ ఆయనకు వివరించినట్లు తెలుస్తోంది.
రెండు పార్టులుగా వ్యూహం సినిమాను తీసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. తొలి పార్ట్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి హఠాన్మరణం, అనంతరం చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలు, ఓదార్పుయాత్ర, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం, కడప లోక్సభ ఉప ఎన్నికలో రికార్డుస్థాయి మెజారిటీతో ఘన విజయం సాధించడం, అనంతరం ఆయనపై ప్రత్యర్థి పార్టీలు బనాయించిన అక్రమ కేసుల వ్యవహారం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం వంటి అంశాలు ఉండబోతోన్నాయి.
రెండో పార్ట్లో 2014 తరువాతి రాజకీయ పరిణామాలు ఉంటాయని తెలుస్తోంది. ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్ అసెంబ్లీలో అప్పటి చంద్రబాబు ప్రభుత్వంపై పోరాడిన తీరు, మైక్ ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేయడం, మహా ప్రస్థానం పాదయాత్రకు దారి తీసిన పరిణామాలను రెండో పార్ట్లో రామ్ గోపాల్ వర్మ చిత్రీకరించనున్నారు.
2019 ఎన్నికల్లో జగన్ సాధించిన తిరుగులేని విజయం, వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వం సంక్షేమాభివృద్ధి పథకాల అమలు, వలంటీర్లు, సచివాలయ వ్యవస్థ, రైతు భరోసా కేంద్రాలు విలేజ్ క్లినక్స్ వంటి గ్రామీణ స్థాయిలో చోటు చేసుకున్న విప్లవాత్మక మార్పులను రామ్ గోపాల్ వర్మ రెండో పార్ట్లో తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. 2024 అసెంబ్లీ ఎన్నికలకు ముందు రెండో పార్ట్ విడుదలవుతుందని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications