నేను మహామంత్రిని: కేంద్రమంత్రి పదవిపై రాంమాధవ్, బాబుకు ఝలక్
ఢిల్లీ: తాను కేంద్రమంత్రిని కాబోతున్నట్లు వచ్చిన వార్తల పైన బీజేపీ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ స్పందించారు. ఈ వార్తలను ఖండిస్తున్నానని చెప్పారు. అసోంలో బీజేపీ గెలుపు వెనుక... రామ్ మాధవ్ కూడా తనదైన పాత్ర పోషించిన విషయం తెలిసిందే.
అంతకుముందు జమ్ము కాశ్మీర్లో ప్రభుత్వం ఏర్పాటుకు ఆయన చర్చలు జరిపారు. ఆయన చర్చల ఫలితంగానే జమ్ము కాశ్మీర్లో బీజేపీ మిత్రపక్షంతో ముఫ్తీ ప్రభుత్వం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఆయనకు విదేశాంగ శాఖ ఇచ్చే యోచనలో ప్రధాని మోడీ ఉన్నారని వార్తలు వచ్చాయి.
దీనిపై రామ్ మాధవ్ స్పందించారు. తెలుగు పత్రికలన్నీ తాను కేంద్రమంత్రిని అవుతానని రాస్తున్నాయని, అది నిజం కాదన్నారు. ఇప్పుడు నేను పార్టీలో మహామంత్రిని (ప్రధాన కార్యదర్శి) అని, మంత్రిని కాను అని చెప్పారు. పార్టీ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించడం తనకు సంతృప్తినిస్తుందన్నారు.
ఒకవేళ ప్రధాని మోడీ ఆహ్వానిస్తే ఇలాగే చెబుతారా అని విలేకరులు ప్రశ్నించగా.. మిమ్మల్ని అడిగితే మీరు చెప్పండి, నన్ను అడిగితే నేను చెబుతానని సరదాగా వ్యాఖ్యానించారు. అసోంలో బీజేపీ గెలుపు వెనుక రామ్ మాధవ్ కృషి కూడా ఎంతో ఉంది.
నిధులపై చంద్రబాబుకు ఝలక్
ఏపీకి సాయం అందలేదన్నది పచ్చి అబద్ధమని రామ్ మాధవ్ అన్నారు. ఏపీకి సరైన నిధులు రావడం లేదని టిడిపి నేతలు చెబుతోన్న విషయం తెలిసిందే. దీనిని ఆయన ఖండించారు. ఏపీ ప్రజల్లో ప్రత్యేకహోదా సెంటిమెంట్ బలంగా ఉందని చెప్పారు.
హోదాపై రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు చర్చించి నిర్ణయం తీసుకోవాలన్నారు. ఏపీలో బీజేపీ బలోపేతానికి పాటుపడతామన్నారు. రెండు సీట్ల స్థాయి నుంచి అధికారం చేపట్టే స్థాయికి అసోంలో చేరామన్నారు. ఏపీలో కూడా అదే స్థాయికి చేరుకుంటామన్నారు. తూర్పు తీర ప్రాంతంలో పార్టీని బలోపేతం చేస్తామన్నారు.