చంద్రబాబుపై కోపంతోనే మూడు రాజధానులా .. ప్రశ్నించిన ఎంపీ రామ్మోహన్ నాయుడు
ఏపీ శాసనసభ సమావేశాల చివరి రోజు రాజధాని అంశంపై సీఎం జగన్ మోహన్ రెడ్డి చేసిన ప్రకటన ఏపీలో దుమారం రేపింది. ఏపీ సీఎం జగన్ సూచనప్రాయంగా ఆంధ్రప్రదేశ్ మూడు రాజధానులు ఉంటె బాగుంటుంది అని చేసిన ప్రకటనపై ఇప్పటికే రాజధాని రైతుల నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. ఇక మరోపక్క ఏపీలోని ప్రతిపక్ష టీడీపీ జగన్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఏపీకి మూడు రాజధానులు అంటూ ముఖ్యమంత్రి జగన్ చేసిన వ్యాఖ్యలు అనాలోచిత వ్యాఖ్యలని టీడీపీ మండిపడుతోంది.
మూడు ప్రాంతాల మధ్య ఘర్షణ పెట్టేందుకే జగన్ మూడు రాజధానుల ప్రకటన: రాజధాని రైతుల ఆగ్రహం
టీడీపీ నేత, ఎంపీ రామ్మోహన్ నాయుడు జగన్ చేసిన ప్రకటనపై స్పందించారు. కేవలం చంద్రబాబుపై కోపంతోనే మూడు రాజధానులు అని ప్రకటన చేశారని ఆయన మండిపడ్డారు.సింగపూర్ను ఆదర్శంగా తీసుకుని రాజధానిని అభివృద్ధి చేసేందుకు చంద్రబాబు ప్రయత్నించారన్నారు ఎంపీ రామ్మోహన్నాయుడు. ఎవరైనా అభివృద్ధి చెందే దేశాన్ని ఆదర్శంగా తీసుకుంటారని , కానీ జగన్ దక్షిణాఫ్రికాను ఆదర్శంగా తీసుకుంటారా అని ఆయన ప్రశ్నించారు. బాబుపై కోపంతో ఇప్పుడు అమరావతిని మార్చేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.
అభివృద్ధి వికేంద్రీకరణ అంటే మూడు రాజధానుల ఏర్పాటు కాదని ఆయన పేర్కొన్నారు. కావాలనే చంద్రబాబు అమరావతిని నిర్మించే సంకల్పంతో ముందుకు వెళ్ళారన్న కోపంతో ఈ గందరగోళం సృష్టిస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. ఏపీ రాజధానిపై ఇప్పటి వరకు స్పష్టత ఇవ్వకపోవడం ఏంటని ప్రశ్నించారు. గత 6 నెలల్లో 22 మంది వైసీపీ ఎంపీలు రాష్ర్ట అభివృద్ధి కోసం ఏం పోరాటం చేశారని ఎంపీ రామ్మోహన్ నాయుడు నిలదీశారు. ఎన్నికల్లో పలు హామీలిచ్చి ఇంత వరకు ఏమీ సాధించకపోవడం వైసీపీ ఎంపీల వైఫల్యమన్నారు. ఇక ఇలాంటి ప్రకటనలతో రాష్ట్రాభివృద్ధి మరింత వెనకపడుతుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.