ఏపీ ప్రభుత్వ సలహాదారు రామచంద్రమూర్తి రాజీనామా - జగన్ సర్కారులో తొలి వికెట్ ?
ఏపీ ప్రభుత్వ సలహాదారు పదవికి సీనియర్ జర్నలిస్టు కొండుభట్ల రామచంద్రమూర్తి రాజీనామా సమర్పించారు. ఇవాళ ప్రభుత్వ ముఖ్య సలహాదారు అజేయ కల్లంను కలిసి ఆయన తన రాజీనామా సమర్పించారు. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వ ప్రజా విధానాల సలహాదారుగా ఆయన పనిచేస్తున్నారు. రామచంద్రమూర్తి రాజీనామాతో వైసీపీ సర్కారు కొలువుదీరాక మంత్రుల తర్వాత తొలి రాజీనామా ఇదే.
గతేడాది రాష్ట్రంలో వైసీపీ సర్కారు కొలువుదీరాక పలువురు సలహాదారులను నియమించింది. అందులో రామచంద్రమూర్తి కూడా ఒకరు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో పలు మీడియా సంస్ధల్లో పనిచేసిన అనుభవం కలిగిన రామచంద్రమూర్తి ఈ పదవిలోకి రాకముందు అధికార వైసీపీకి చెందిన సాక్షి మీడియా సంస్ధలోనూ ఎడిటోరియల్ డైరెక్టర్గా పనిచేశారు. ప్రముఖ వార్తాపత్రికలు, మీడియా సంస్ధల్లోనూ పనిచేసిన అనుభవం కూడా రామచంద్రమూర్తికి ఉంది.
ప్రభుత్వ సలహాదారుగా నియమితులయ్యాక అంతకు ముందు వరకూ పాత్రికేయుడిగా ఉన్న స్వేచ్ఛ కరవైందని ఆయన తన సన్నిహితుల వద్ద చెప్పినట్లు తెలిసింది. ఆరునెలల క్రితమే రాజీనామా చేయాలని నిర్ణయం కూడా తీసుకున్నట్లు సమాచారం. అప్పట్లో ఆయన రాజీనామా సమర్పించేందుకు కూడా సీఎం జగన్ అపాయింట్మెంట్ ఇవ్వలేదనే ప్రచారం కూడా సాగింది. చివరికి వ్యక్తిగత కారణాలతోనే తాను తప్పుకుంటున్నట్లు రామచంద్రమూర్తి తన రాజీనామా లేఖలో పేర్కొనడంతో వివాదం సద్దుమణిగింది.