జగన్.. జాగ్రత్తగా మాట్లాడు
YS Jagan: సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం పరిధిలోని పాపిరెడ్డిపల్లిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన విమర్శలు దుమారం రేపుతున్నాయి. జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు ఆయనపై ఎదురుదాడికి దిగారు. ప్రత్యారోపణలు సంధిస్తోన్నారు.
పాపిరెడ్డిపల్లిలో దారుణహత్యకు గురైన పార్టీ కార్యకర్త కురుబ లింగమయ్య కుటుంబాన్ని జగన్ పరామర్శించిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారాయన. పోలీసుల వైఖరినీ తప్పుపట్టారు.

చంద్రబాబు మెప్పు కోసం పోలీసులు తమ టోపీలపై ఉన్న సింహాలకు సెల్యూట్ కొట్టకుండా చంద్రబాబు చెప్పినట్లు చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. అలాంటి పోలీసుల బట్టలు ఊడదీసి ప్రజల ముందు దోషులుగా నిలబెడతామని, ఉద్యోగాలు ఊడగొడతామని అన్నారు.
ప్రతి పోలీసు అధికారి తమ ప్రవర్తనను మార్చుకోవాల్సి ఉంటుందని చెప్పారు. భవిష్యత్తులో ప్రతి పనికీ వడ్డీతో సహా చెల్లిస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు జగన్. రామగిరి ఎస్ఐ సుధాకర్ వీడియో కాల్స్తో ప్రతి ఎంపీటీసీని ప్రలోభపెట్టారని జగన్ ఆరోపించారు. ఆయనపై ఎందుకు చర్యలు తీసుకోవట్లేదంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు. ఆయన ఫోన్ రికార్డులను ఎందుకు పరిగణలోకి తీసుకోలేదని ప్రశ్నించారు.
లింగమయ్య కొడుకుపై కూడా దాడి చేశారని, ఫిర్యాదులు తీసుకోకుండా ఇబ్బంది పెట్టారని జగన్ విమర్శించారు. లింగమయ్య భార్యకు చదువు రాదని ఆమెతో వేలిముద్రలు తీసుకున్నారని జగన్ గుర్తుచేశారు. పోలీసులు తాము రాసుకున్న పేపర్పై భయపెట్టి వేలిముద్రలు బలవంతంగా వేయించుకున్నారని, కొడుకు స్టేట్మెంట్ తీసుకోలేదని అన్నారు.
రాష్ట్రం.. బీహర్ కంటే దారుణంగా తయారవుతోందంటూ జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. లింగమయ్య హత్య కేసులో పోలీసులు ఇద్దరిపై మాత్రమే కేసు పెట్టారని, ఈ కేసులో క్రియాశీలంగా వ్యవహరించిన రమేష్ నాయుడిపై ఎందుకు కేసు పెట్టలేదని జగన్ ప్రశ్నించారు. వారంతా ఎమ్మెల్యే బంధువులు కాబట్టి వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు.

రెచ్చగొట్టిన వ్యక్తులను ఎందుకు ఈ కేసుల నుంచి తప్పించారు? ఈ హత్యను ప్రోత్సహించిన ఎమ్మెల్యే, ఆమె కుమారుడిపై ఎందుకు కేసు పెట్టలేదు?, ఫిర్యాదు చేసినా కూడా పోలీసులు ఎందుకు పట్టించుకోలేదంటూ ప్రశ్నల వర్షాన్ని గుప్పించారు.
ఈ విమర్శలపై రామగిరి ఎస్ఐ సుధాకర్ ఘాటుగా స్పందించారు. ఈ మేరకు ఓ సెల్ఫీ వీడియోను విడుదల చేశారు. పోలీసుల బట్టలూడదీసి కొడతానంటూ జగన్ హెచ్చరించడాన్ని తప్పుపట్టారు. పోలీసు దుస్తులు జగన్ ఇస్తే వేసుకున్నవి కాదని, కష్టపడి చదివి, రన్నింగ్ రేస్, వేలమంది పోటీపడ్డ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి ఈ యూనిఫాం వేసుకున్నామని అన్నారు.
ఎవరో వచ్చి ఊడదీస్తానంటే.. ఊడదీయడానికి ఇదేమీ అరటితొక్క కాదని సుధాకర్ అన్నారు. తాము నిజాయితీగానే ప్రజల పక్షాన నిలబడతామని, నిజాయితీగానే ఉద్యోగం చేస్తాం, నిజాయితీగానే ఛస్తామని చెప్పారు. అంతే తప్ప అడ్డదారులు తొక్కబోమని, జాగ్రత్తగా మాట్లాడాలని అన్నారు.












Click it and Unblock the Notifications