రమణ దీక్షితులు ఎన్నో తప్పులు చేశారు...రాజకీయ వృత్తి తీసుకున్నారు:మంత్రి కేఈ
విజయవాడ:తిరుమల శ్రీవారి ఆలయం రమణ దీక్షితులు బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారని డిప్యూటీ సిఎం,దేవాదాయ శాఖా మంత్రి కేఈ కృష్ణమూర్తి అన్నారు. గురువారం విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రమణ దీక్షితులు తీరును ఎండగట్టారు.
రమణ దీక్షితులు అర్చక వృత్తిని వదిలేసి, రాజకీయ వృత్తిని తీసుకున్నారని...పబ్లిసిటీ కోసమే ఇంత బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారని దేవాదాయ శాఖ మంత్రి కేఈ కృష్ణమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ఆలయ పవిత్రతను దెబ్బతీసేలా మాట్లాడడాన్నితీవ్రంగా పరిగణిస్తున్నామన్నారు. అసలు ఆయన పక్క రాష్ట్రంలో ప్రెస్మీట్ పెట్టి ఎలా ఆరోపణలు చేస్తారని కేఈ ప్రశ్నించారు.
తిరుమల ఆలయాలలో పురావస్తు వారిని నియమించాలని చెప్పడానికి ఆయనకు ఏం అధికారముందని మంత్రి కెఈ ప్రశ్నించారు.ప్రధాన అర్చకుడిగా రమణదీక్షితులు ఎన్నో తప్పులు చేశారన్నారు. ఆయన ప్రధానాలయంలోకి తన మనవడిని తీసుకెళ్లారు, వీఐపీలు వస్తే గెస్ట్హౌస్ల్లోకి వెళ్లి ఆశీర్వాదం ఇచ్చేవారు. అలాగే కొంత మందిని ఆయన అర్థరాత్రి ఆలయంలోకి తీసుకెళ్లి పూజలు చేయించారు. ఆ చర్యలను భరించలేకే టీటీడీ రమణ దీక్షితులను విధులనుంచి తొలగించింది. ఇంతవరకూ నేను రమణ దీక్షితులు వ్యవహారాన్ని పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు ఆయన తన హద్దులను దాటి మరి ఆరోపణలు చేస్తున్నారు. ఇక ఉపేక్షించేది లేదు...ఆయన చేసిన పనులపై ప్రత్యేక విచారణ జరిపిస్తామని మంత్రి కెఈ ప్రకటించారు.
"స్వామి వారి ఆస్తుల గురించి కూడా రమణ దీక్షితులు అవాకులు చెవాకులు మాట్లాడుతున్నారు. కానీ ప్రతియేడు స్వామి వారి అభరణాలను లెక్కిస్తున్నాము. 1996లో స్వయంగా రమణ దీక్షితులే అన్ని నగలు భద్రంగా ఉన్నాయన్నారు, మరి ఇప్పుడు ఇలా ఎందుకు అబద్దమాడుతున్నారో ఆయనకే తెలియాలన్నారు. రమణ దీక్షితులు ముగ్గురు కొడుకులు పూజలు, అర్చనలుకు హజరవ్వటం లేదు, అయినా వారిని అర్చకులుగా కొనసాగించాలనుకుంటున్నారు. అందుకే ఈ విషయంలో రమణ దీక్షితులుకు, మిగతా అర్చకులకు గొడవలు వచ్చాయి. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా శ్రీవారి దర్శనకు వచ్చినప్పుడు మేమే ఆయనకు ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేయించాం. అలానే డాలర్ శేషాద్రి విషయం గురించి కూడా ఆరా తీస్తాం. కేవలం పబ్లిసిటీ కోసమే రమణ దీక్షితులు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు."...అని రమణ దీక్షితుల వ్యవహార శైలిపై మంత్రి కేఈ కృష్ణమూర్తి ధ్వజమెత్తారు.