చిరు చేతిలో మోసం, ఇప్పుడు పవన్ కళ్యాణ్ తీరుతో మోసపోవాలా: రమణ
తిరుపతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీరుపై కాపు సంఘం రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షుడు ఓవి రమణ తీవ్రంగా మండిపడ్డారు. రాజకీయంగా ఏదో ఉద్ధరిస్తారని గతంలో తాము చిరంజీవిని చూసి మోసపోయామని, ఇప్పుడు పవన్ కళ్యాణ్ తీరుతో మోసపోవాలా అని ఆయన అడిగారు. ఆయన గురువారం తిరుపతిలో మీడియాతో మాట్లాడారు
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో భేటీ తర్వాత జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో కాపుల సమస్యపై రాష్ట్రంలో ఉధృతంగా కొనసాగుతున్న ఉద్యమాన్ని ప్రస్తావించకపోవడం బాధాకరమని ఆయన అన్నారు. ఎవరికి అన్యాయం జరిగినా తమ పార్టీ చూస్తూ ఊరుకోదని, పాలకులనైనా నిలదీస్తుందని ఎన్నికల ముందు సినిమా డైలాగులు చెప్పిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు వాటిని విస్మరించారని ఆయన ఎత్తిపొడిచారు.

కాపులను బీసీల్లో చేరుస్తామన్న హామీని అమలు చేయకుండా మోసగిస్తున్నారని ఆయన ముఖ్యమంత్రిపై మండిపడ్డారు. గతంలో ముఖ్యమంత్రిగా కొనసాగినప్పుడే కమిషన్ సూచించిన అంశాలను పరిగణనలోకి తీసుకోకపోవడం పల్ల చంద్రబాబు పదేళ్ల పాటు ప్రతిపక్షంలో ఉండాల్సి వచ్చిందని ఆయన అన్నారు.
కాపు సమస్యలపై ఏ ప్రాంతంలో ఉద్యమాలు వస్తే ఆ ప్రాంత నేతలు, మంత్రులతో ప్రకటనలు చేయించినంత మాత్రాన ఉద్యమం ఆగదని ఆయన అన్నారు. రాయలసీమలోని కాపులకు సరైన గుర్తింపు ఇవ్వకుండా మభ్య పెట్టాలని చూస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రజలే బుద్ధి చెప్తారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications