గుర్రపు బగ్గీపై రామ్మోహన్ నాయుడు-శ్రీశ్రావ్య: నోరూరించే వంటకాలు
ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడు స్వగ్రామం నిమ్మాడలో ఆదివారం వివాహ విందుకు ఎంపీ బాబాయి, మంత్రి అచ్చెన్నాయుడు సోదరుల ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు చేశారు.
శ్రీకాకుళం: ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడు స్వగ్రామం నిమ్మాడలో ఆదివారం వివాహ విందుకు బాబాయి, మంత్రి అచ్చెన్నాయుడు సోదరుల ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు చేశారు.
ఇవీ ఏర్పాట్లు: రామ్మోహన్ నాయుడు రిసెప్షన్ కోసం భారీ ఎత్తున!.. 20ఎకరాల స్థలంలో!
విందుకు సుమారు లక్ష మంది వస్తారని అంచనాతో ఎస్పీ బ్రహ్మారెడ్డి ఆదేశాల మేరకు సుమారు 1500 మంది పోలీసు సిబ్బంది బందోబస్తు ఏర్పాటు చేశారు.
నోరూరించే వంటలు..
విందులో నోరూరించే వంటలు వండేందుకు ధవళేశ్వరం నుంచి ప్రత్యేకంగా సుమారు 950 మందిని రప్పించారు. వీరు విందులో నోరూరించే 15 రకాల వంటకాలను తయారు చేసి వడ్డించనున్నారు. విందు ప్రాంగణంలో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టేందుకు డీపీవో కోటేశ్వరరావు ఆధ్వర్యంలో 8 మంది ఈవోలు, 90 మంది పారిశుద్ధ్య సిబ్బంది పనిచేస్తున్నారు.
బాలకృష్ణ వచ్చే అవకాశం
సంగీత దర్శకుడు, గాయకుడు వందేమాతరం శ్రీనివాస్ సంగీత విభావరికి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. భారీ ఎత్తున విద్యుత్తు దీపాలంకరణలు చేపట్టారు. వివాహ విందు కార్యక్రమానికి హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వస్తున్నట్లు తెలుస్తోంది.
గుర్రపు బగ్గీపై ఊరేగిన రామ్మోహన్ నాయుడు దంపతులు
కాగా నిమ్మాడలో శనివారం సాయంత్రం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు, శ్రీశ్రావ్య దంపతులను గుర్రపు బగ్గీపై ఘనంగా ఊరేగించారు. తొలుత వారు బాబాయి కింజరాపు హరివరప్రసాద్ ఇంట్లో గృహప్రవేశం చేసి పూజలు నిర్వహించారు. అనంతరం కుటుంబ పెద్దల ఆశీర్వాదం పొందారు.
గ్రామస్తుల దీవెనలు
రామ్మోహన్ నాయుడు, శ్రీశ్రావ్యల వివాహం ఈ నెల 14న విశాఖ ఏయూ మైదానంలో జరిగిన నేపథ్యంలో ఆదివారం స్వగ్రామమైన నిమ్మాడలో రిసెప్షన్ వేడుకను నిర్వహించనున్నారు. శనివారం గుర్రపుబగ్గీపై ఊరేగింపు సందర్భంగా బాణసంచా పేలుళ్లు, డీజే సౌండ్లు, లైటింగ్ సౌకర్యాలతో ఈ ఊరేగింపు ఆద్యంతం ఆహ్లాదకర వాతావరణంలో నిర్వహించారు. ఊరేగింపు కార్యక్రమానికి నిమ్మాడ గ్రామస్తులతో పాటు చుట్టుపక్క గ్రామస్తులు వేలసంఖ్యలో పాల్గొన్నారు. గ్రామస్తులు అక్షింతలతో దీవించారు.
తల్లి ఆశీస్సులు
నాన్నమ్మ కళావతి, తల్లి విజయకుమారి, బంధువులు, కుటుంబ సభ్యులు నూతన వధూ వరులను ఆశీర్వదించారు. గ్రామంలో ఎర్రన్నాయుడు కాంస్య విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి అచ్చెన్నాయుడు, పీఏసీఎస్ అధ్యక్షులు కింజరాపు హరివరప్రసాద్, ఏసీపీ ప్రభాకర్తో పాటు నిమ్మాడ సర్పంచ్ కింజరాపు విజయమాధవి, ఎంపీ సోదరి భవానీ, టిడిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.