అరుదైన తీర్పు: కామాంధులకు జీవిత ఖైదు, దాదాపు 20మందిపై రేప్!
కర్నూలు: అత్యాచారం కేసులో ఇద్దరు నిందితులకు కర్నూలు న్యాయస్థానం బతికున్నంత కాలం జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. రవి, శ్రీనివాస్ అనే ఇద్దరికి న్యాయస్థానం జైలు శిక్ష విధించింది. ఇది అరుదైన తీర్పుగా చెబుతున్నారు.
గత ఏడాది వీరు ఓ యువతిని కిడ్నాప్ చేసి, అత్యాచారం చేశారు. ఈ కేసును విచారించిన న్యాయస్థానం వారికి బతికున్నంత కాలం జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి జ్యోతిర్మయి తీర్పు చెప్పారు.
కాగా, వారి పైన పలు కేసులు ఉన్నట్లుగా తెలుస్తోంది. వారు మరో ఏనిమిదికి పైగా నేరాలకు పాల్పడ్డట్లుగా కేసులు నమోదయినట్లుగా తెలుస్తోంది. చాలామంది మహిళల పైన అత్యాచారానికి పాల్పడినట్లుగా తెలుస్తోంది. వీరు ఇరవై మందికి పైగా మహిళలపై అత్యాచారానికి పాల్పడ్డారని అంటున్నారు. వారు నెల రోజుల వ్యవధిలోనే ముగ్గురి పైన అఘాయిత్యానికి పాల్పడినట్లుగా తెలుస్తోంది.
వీరు కర్నూలు జిల్లా కేంద్రంలో ఉంటున్నారు. రవి, శ్రీను ఆటో నడుపుతూ ఉండేవారు. డ్రైవర్ల ముసుగులో మహిళలను ఆటోలో ఎక్కించుకుని వారిపై అత్యాచారాలకు పాల్పడేవారు. వీరిపై జిల్లాలోని పలు స్టేషన్లలో అత్యాచారాల కేసులు ఉన్నాయి.
ఏడాది క్రితం అత్యాచారం కేసులో వీరు అరెస్టయ్యారు. అనంతరం బెయిల్ పైన విడుదలయ్యారు. అయితే, బెయిల్ పైన విడుదలైన నెల వ్యవధిలోనే ముగ్గురి పైన రేప్ చేశారు. వీరి బాధితుల్లో విద్యార్థినులు, మెడికోలు, యువతుల చాలామంది ఉన్నారని తెలుస్తోంది.