బాత్రూంలో బంధించి రేప్యత్నం, అనంతలో ఆర్నెల్లుగా గ్యాంగ్రేప్, వీడియో
గుంటూరు/అనంతపురం: గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం జరిగింది. జబ్బీర్ అనే యువకుడు అనారోగ్యంతో బాధపడుతున్న తన తండ్రిని చూసేందుకు వచ్చిన ఓ యువతి పైన అత్యాచారయత్నం చేశాడు. ఆమెను బాత్రూంలో బంధించి, భయపెట్టి, తాను కలెక్టర్కు జిమ్ ట్రెయినర్ను అని బుకాయించాడు.
దీంతో కాసేపు హైడ్రామా నడిచింది. చివరకు అతడిని సెక్యూరిటీ గార్డులు బంధించి పోలీసులకు అప్పగించారు. బాధిత యువతి ఓ వార్డులో చికిత్స పొందుతున్న తండ్రిని పరామర్శించేందుకు మంగళవారం ఆసుపత్రికి వచ్చింది. అక్కడికి సమీపంలోని బాత్రూమ్కు వెళ్లింది.
అప్పటికే అక్కడ పొంచి ఉన్న నిందితుడు ఒక్కసారిగా తలుపు వేసేశారు. ఆశ్చర్యపోయఇన యువతి కేకలు వేసింది. సెక్యూరిటీ సిబ్బంది అక్కడకు వచ్చారు. గమనించిన యువకుడు.. యువతి వీపుకు పెన్ను ఆనించి, కత్తి అని భయపెట్టాడు. లోపల ఎవరూ లేరని చెప్పాలని బెదిరించాడు.
ఆమె అతడు చెప్పమన్నట్టే చెప్పింది. మహిళా సెక్యూరిటీ గార్డు ఒకామె ఆమె మాటలు నమ్మలేదు. ఆమెను పక్కకు తోసి లోపలకు వెళ్లారు. తలుపు తెరుచుకోవడంతోనే పారిపోవడానికి అతడు ప్రయత్నించగా, అక్కడే ఉన్న మిగతా మహిళా గార్డులు అతడిని బంధించారు. యువతి బంధువులు అతడికి దేహశుద్ధి చేశారు.
దీంతో, అతను రివర్స్ అయ్యాడు. తాను కలెక్టర్కు జిమ్ ట్రెయినర్ను అని, అందరి ఉద్యోగాలు తీసేయిస్తానని బెదిరించాడు. గార్డులు అతనిని పోలీసులకు అప్పగించారు.
గిరిజన బాలికపై ఆర్నెల్గుగా అత్యాచారం
అనంతపురం జిల్లాలో ఇంటర్ చదువుతున్న ఓ బాలిక పైన ఎనిమిది మంది కామాంధులు ఆర్నెల్లుగా సామూహిక అత్యాచారానికి పాల్పడుతున్నారు. కళ్యాణదుర్గం మండలంకు చెందిన బాలిక అనంతపురంలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. ప్రభుత్వ హాస్టల్లో ఉంటోంది.
ఆ బాలిక స్నేహితురాలిని అమర్నాథ్ అనే యువకుడు ప్రేమించాడు. అతను తన ప్రియురాలి వద్దకు వచ్చినప్పుడు గిరిజన బాలికను చూసి, కన్నేశాడు. ఆరు నెలల క్రితం ఓ రోజు హాస్టల్ వద్ద దింపుతానని చెప్పి బైక్ పైన ఎక్కించుకొని, నగర శివారులోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు.
దానిని సెల్ ఫోన్లో చిత్రీకరించి, ఆరు నెలలుగా పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. అతనితో పాటు మిత్రుడు కార్తీక్ కూడా అఘాయిత్యానికి పాల్పడ్డాడు. విషయం తెలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.