రాహుల్ గాంధీ సభ: ఉండవల్లి స్థానంలో రాపోలు
మహబూబ్ నగర్: కాంగ్రెసు పార్టీ నిర్వహించే సభల్లో ఇంతకుముందు ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ వంటి అగ్రనేతల ప్రసంగాన్ని నాటి కాంగ్రెసు పార్టీ నేత, నేటి జై సమైక్యాంధ్ర పార్టీ సీనియర్ నేత ఉండవల్లి అరుణ్ కుమార్ హిందీ నుండి తెలుగులోకి అనువాదం చేసేవారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన నేపథ్యంలో ఉండవల్లి కాంగ్రెసు పార్టీ నుండి బయటకు వెళ్లిపోయారు. మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి స్థాపించిన జై సమైక్యాంధ్ర పార్టీలో ఆయన ఉన్నారు. విభజనపై కాంగ్రెసు పార్టీ ఉండవల్లి వంటి నేతలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.

ఈ నేపథ్యంలో ఇప్పుడు ఉండవల్లికి బదులు అనువాదకులుగా రాజ్యసభ సభ్యులు రాపోలు ఆనంద్ భాస్కర్ వచ్చారు. సోమవారం మహబూబ్ నగర్ జిల్లాలో జరిగిన రాహుల్ గాంధీ బహిరంగ సభలో ఉపాధ్యక్షుడి ప్రసంగాన్ని రాపోలు తెలుగులోకి అనువదించారు. కొద్ది రోజుల క్రితం కరీంనగర్ జిల్లాలో జరిగిన సోనియా గాంధీ సభలో ఆమె ప్రసంగాన్ని తెలుగులోకి అనువదించే వారు దొరకలేదు. ఇప్పుడు రాపోలు... ఉండవల్లి స్థానాన్ని తెలంగాణలో భర్తీ చేయనున్నారు.
కాగా, సభలో రాహుల్ గాంధీ తెలంగాణ రాష్ట్ర సమితి, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీల పైన నిప్పులు చెరిగారు. టిడిపి తెలంగాణను అడ్డుకోవాలని చివరి వరకు ప్రయత్నాలు చేసిందని, బిజెపి డబుల్ గేమ్ ఆడిందని, తెలంగాణలో తెరాస పాత్ర లేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications