ప్రాణాలు కాపాడారు: రత్నాచల్ ఎక్స్ప్రెస్ సిబ్బందిపై ప్రశంసలు, అవార్డులిచ్చే యోచన
తూర్పుగోదావరి: జిల్లాలోని తుని సమీపంలో రత్నాచల్ ఎక్స్ప్రెస్పై ఆందోళనకారులు దాడి చేసిన ఘటనలో అప్రమత్తంగా వ్యవహరించిన రైల్వే సిబ్బందికి అవార్డులు ఇవ్వాలని రైల్వేశాఖ యోచిస్తోంది.
ఈ ఘటన సందర్భంగా ప్రయాణికులను అప్రమత్తం చేసిన ముగ్గురు టీసీలు, ఏసీ మెకానిక్, గార్డుకు ప్రశంసా పత్రాలు ఇచ్చేందుకు రైల్వే అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
Photos: తుని దృశ్యాలు
ఆందోళనకారులు రైలుపైకి ఎక్కుతున్న సమయంలో అధికారులకు సమాచారం ఇచ్చి విద్యుత్ సరఫరా నిలిపివేసేలా చేసిన డ్రైవర్ సూరిబాబును ఇప్పటికే రైల్వే ఉన్నతాధికారుల ప్రశంసించారు.
రైల్వే సిబ్బంది సమయస్ఫూర్తితో వ్యవహరించి అనేకమంది ప్రాణాలను కాపాడారని అధికారులు కొనియాడారు. ఇది ఇలా ఉండగా, ఆందోళనకారుల దాడిలో పూర్తిగా దగ్ధమైన రత్నాచల్ ఎక్స్ప్రెస్ను రేపు, ఎల్లుండి రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు.
కాపులకు రిజర్వేషన్లు కోరుతూ రెండ్రోజుల క్రితం రత్నాచల్ ఎక్స్ప్రెస్కు ఆందోళనకారులు నిప్పుపెట్టిన విషయం తెలిసిందే. రైల్వే సిబ్బంది అప్రమత్తతోనే ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. కాగా, రైలు మాత్రం దాదాపు పూర్తి కాలిపోయింది.