వైసీపీ నేతల అరాచకం మండిపడ్డ మంత్రి
హైదరాబాద్: గుంటూరు జిల్లాలోని సరస్వతి సిమెంట్ పరిశ్రమకు ఇచ్చిన భూముల్లో సాగుచేసిన పంటలను వైఎస్ఆర్సీపీ నేతలు గుండాగిరితో అక్రమంగా దున్నేశారని రాష్ట్ర సాంఘిక, సంక్షేమశాఖ మంత్రి రావెల కిషోర్ బాబు అన్నారు. ఈరోజు ఆయన కడప జిల్లాలోని ప్రొద్దుటారులో జన్మభూమి-మాఊరు కార్యక్రమంలో పాల్గొని విలేకరులతో మాట్లాడారు.
వైఎస్ఆర్సీపీ రౌడీయిజంతో ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తోందని, వైకాపా నేతలు అరాచకం సృష్టిచడం తగదన్నారు. వైఎస్ఆర్ అధికారంలో ఉండగా సరస్వతి సిమెంట్స్ కు భూములు అడ్డగోలుగా కట్టబెట్టారని.. మంత్రి తెలిపారు. ప్రజలకు మంచి చేయడమే తమప్రభుత్వలక్ష్యమని అందుకోసమే జన్మభూమి - మాఊరు వంటి పధకాలు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రవేశపెట్టారని, అది చూసి ఓర్వలేని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తమపై లేనిపోని అభాండాలు వేయాలని చేస్తున్నారని మంత్రి రావేల మండిపడ్డారు.
ఈ సమావేశంలో రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్, ఎమ్మేల్సీ పుల్లయ్య, పార్టీ సీనియర్ లీడర్లు వరదరాజుల రెడ్డి, శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కొద్ది రోజుల క్రితం వివాదాస్పద సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్లాంట్ కు కేటాయించిన భూమిని రద్దు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గుంటూరు జిల్లా మాచవరం, చెన్నాయిపాలంలో 2011లో సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్లాంట్ సున్నపురాయి ఉన్న భూములను 600 ఎకరాలను కేటాయించింది.
అంతే కాకుండా మరో 400 ఎకరాలను యాజమాన్యం సేకరించింది. భూమి కేటాయించే సమయంలో స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని యాజమాన్యం హామీ ఇచ్చింది. అయితే ఇప్పటి వరకు ఎలాంటి నిర్మాణాలు చేపట్టలేదు. దీంతో గత సంవత్సరం ఆ భూముల్లో రైతులు వ్యవసాయం ప్రారంభించారు. రైతులు సాగు చేసుకున్న పంటలను కొందరు కిరాయి రౌడీలు ట్రాక్టర్లతో దున్నివేసిన విషయం తెలిసిందే.
సరస్వతీ పవర్ ప్లాంట్ భూముల్లో రైతులు సాగు చేసుకున్న పంటలను కొందరు కిరాయి రౌడీలు, హంతకులు ట్రాక్టర్లతో దున్నివేసిన సంఘటనపై స్పందించిన మంత్రి పుల్లారావు గురువారం జిల్లా కలెక్టర్ కాంతీలాల్దండే, స్థానిక శాసనసభ్యుడు యరపతినేని శ్రీనివాసరావుతో కలిసి ఆ పంట భూములను పరిశీలించి... యరపతినేని పట్టుదల మేరకే స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం ఈ భూముల లీజును రద్దు చేసినట్లు మంత్రి పుల్లారావు ప్రకటించారు. ఈ ప్రాంతంలో ఫ్యాక్టరీ నిర్మాణం జరగదని, ఎవరి భూముల్లో వారే తిరిగి పంటలు పండించుకోవచ్చని రైతులకు భరోసా ఇచ్చిన విషయం తెలిసిందే.
సరస్వతి పవర్ ప్లాంట్కు చెందిన మైనింగ్ లీజులు రద్దు చేయడాన్ని వైకాపా తప్పు పట్టింది. సరస్వతి ఫ్యాక్టరీకి కేటాయించిన చట్టబద్ధమైన భూములను రాష్ట్రప్రభుత్వం బలవంతంగా తీసుకునేందుకు ప్రయత్నించడం దారుణమన్నారు. రిజిస్టరయిన భూములను ప్రభుత్వం వివాదాస్పదం చేయడం తగదన్నారు.
దీంతో సిమెంట్ ఫ్యాక్టరీ కోసం తీసుకున్న తమ భూములను వెనక్కి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆ గ్రామానికి చెందిన రైతులు లోటస్పాండ్లోని వైఎస్ జగన్ ఇంటి ముందు ధర్నా నిర్వహించారు. శనివారం 200 మంది రైతులు అక్కడికి చేరుకొని ఆందోళన నిర్వహించారు.
నాలుగు రోజుల క్రితం ఖాళీగా పడి ఉన్న భూములను సాగు చేసుకుంటామని అక్కడికి వెళితే స్థానిక వైసిపి నేతలు తమపై దాడులకు దిగారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులపై అకారణంగా దాడులకు దిగిన వైసిపి నేతల చర్యలను ఖండిస్తూ ఆ పార్టీ అధ్యక్షుడు జగన్ రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.