TTD: శ్రీవారి ఆలయంలో భక్తులతో సిబ్బంది అసభ్య ప్రవర్తన - ఇదీ జరిగింది..!!
Tirumala: తిరుమల లో ఈ మధ్య కాలంలో పలు అంశాలు వివాదం చేసే ప్రయత్నం జరుగుతోంది. భక్తులతో శ్రీవారి ఆలయంలో సిబ్బంది అసభ్యంగా ప్రవర్తించారని ట్రోల్ అవుతోంది. టీటీడీ పైన చేస్తున్న ప్రచారానికి పాలక మండలి వివరణ ఇస్తోంది. ఇక..ఇప్పుడు శ్రీవారి ఆలయంలో మాపట్ల ఎవరూ అసభ్యంగా ప్రవర్తించలేదని హైదరాబాద్ కు చెందిన భక్తుడు రవికుమార్ వీడియో విడుదల చేసారు. రాజకీయాల కోసం తమను ట్రోల్ చేయొద్దని కోరారు.
వేగంగా వెళ్లాలన్నారు : తిరుమల శ్రీవారి ఆలయంలో దర్శనం వేళ సిబ్బంది భక్తులతో అసభ్యంగా ప్రవర్తించారంటూ పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. దీని పైన హైదరాబాద్ కు చెందిన రవి కుమార్ దంపతులు వాపోయారని కధకాలు ప్రచురితం అయ్యాయి. దీని పైన ఇప్పుడు అదే భక్తుడు రవి కుమార్ వీడియో విడుదల చేసారు. శ్రీవాణి టికెట్ కొని శ్రీవాణి దర్శనం చేసుకున్న తమకు స్వామివారి దర్శనం చాలా బాగా జరిగిందని హైదరాబాద్ కు చెందిన భక్తుడు శ్రీ రవికుమార్ దంపతులు స్పష్టం చేశారు. దర్శనం అనంతరం స్వామి వారిని చూస్తూ వెనక్కు నడుచుకుంటూ తన్మయత్వంలో అక్కడే ఆగిపోయిన సమయంలో అక్కడి సిబ్బంది వేగంగా వెళ్లాలని తమకు గట్టిగా చెప్పారేకానీ అసభ్యంగా ప్రవర్తించలేదని వారు చెప్పారు.

ప్రచారం సరికాదు : ఈ విషయాన్ని మీడియా, సోషల్ మీడియా వక్రీకరించి టీటీడీ మీద బురద చల్లేలా ప్రచారం చేయడం తమకు బాధ కలిగించిందని వారు చెప్పారు. ఈ మేరకు శుక్రవారం వారు ఒక వీడియోను పోస్ట్ చేశారు. తాము శ్రీవాణి టికెట్ మీద దర్శనానికి వచ్చామని చెప్పారు తిరుమలలో వసతి దర్శనం అన్నీ బాగా అయ్యాయి దర్శనం తరువాత స్వామిని చూస్తూ వెనక్కు వస్తూ తన్మయత్వంతో అక్కడే నిలబడిపోయామని వివరించారు.. ఆ సమయంలో అక్కడి సిబ్బంది మాతో గట్టిగా మాట్లాడారని చెప్పారు.
అది నిజం కాదు : దాంతో మేం కొంత బాధపడి వాస్తవాలు టీటీడీ ఉన్నతాధికారుల దృష్టికి వెళితే సమస్యలు ఏమైనా ఉంటే సరి చేసుకుంటారనే ఉద్దేశంతో మీడియాతో మాట్లాడామని వివరించారు. దీన్ని కొందరు లేనివి ఉన్నట్లుగా వారి రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకునేలా ట్రోల్ చేయడం బాధాకరమని వాపోయారు. ఇప్పటికి మేము నాలుగు సార్లు శ్రీవాణి దర్శనానికి వచ్చామని చెప్పుకొచ్చారు. ఎలాంటి ఇబ్బంది కలగలేదని స్పష్టం చేసారు. తమను అడ్డుపెట్టుకుని టీటీడీ మీద బురద చల్లడం చాలా బాధ కలిగించిందని ఆవేదన వ్యక్తం చేసారు.












Click it and Unblock the Notifications