ఔరా ఎంతకష్టం.. చెన్నపట్నంలో విక్రయానికి అన్నగారిల్లు?
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు.. తెలుగు ప్రజలందరికి ‘అన్నగారి’గా పేరొందిన ఎన్టీఆర్ సినీ నటుడిగా ఉన్నప్పుడు చెన్నై నగరంలో కొన్న ఇల్లు అమ్మకానికి సిద్ధంగా ఉన్నది.
చెన్నై: ఆంధ్రులందరికీ ఆయన అన్నగారు.. అంటే అర్థమైందనుకుంటా.. సరిగ్గా 33 ఏళ్ల క్రితం 'తెలుగు ఆత్మ గౌరవ' నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించి.. నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏకఛత్రాధిపత్యం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీని మట్టి కరిపించిన ధీరోదాత్తుడు.
అంతేకాదు జాతీయంగా కాంగ్రెసేతర రాజకీయ పార్టీలను ఒకే వేదికపైకి తేవడంలో కీలక పాత్ర పోషించారు. అంత గొప్పతనం గల ఎన్టీఆర్కు 'టీ నగర్లోని 28 బజుల్లా రోడ్'లో ఒక ఇల్లు ఉంది. దూర ప్రాంతాల నుంచి అక్కడకు తరలివెళ్లే అభిమానులకు ఆ ఇల్లు మరో తిరుపతి! అన్నగారి పట్ల అంతులేని అనురాగానికి అది చిరునామా.
Recommended Video
తెలుగు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన అన్న ఎన్టీఆర్ నివాసం ఇప్పుడు విక్రయానికి సిద్ధమైందని సమాచారం. ఎన్నో అనుబంధాలు, మధుర జ్ఞాపకాలకు గుర్తుగా నిలిచిన చెన్నైలోని ఎన్టీఆర్ నివాసం కొనుగోలు చేసేవారి కోసం దీనంగా ఎదురు చూస్తోంది. బ్రోకర్ ఏలుమలై పేరు, సెల్ఫోన్ నంబర్తో ఆ ఇంటి గేటుకు వేలాడుతున్న బోర్డు తెలుగు ప్రజల హృదయాలను కలచివేస్తోంది.
స్థిరపడ్డాక చెన్నైలో చిన్న ఇల్లు కొనుగోలు
ఎన్టీఆర్ నటుడిగా స్థిరపడ్డాక చెన్నై రంగరాజపురంలో ఓ చిన్న ఇంటిని కొనుగోలు చేశారు. ఆయన రాకతో ఆ వీధి ఎన్టీఆర్ స్ట్రీట్గా మారింది. అక్కడ ఉండగా ఒక కుక్కను పెంచుకుంటూ షూటింగ్ లేని సమయాల్లో దానితో గడిపేవారు. బజుల్లా రోడ్డుకి మారిన తర్వాత ఆ కుక్కను, ఇంటిని తన సోదరుడు త్రివిక్రమరావుకు అప్పగించారు. ఎన్టీఆర్ తన ఆర్థిక పరిస్థితి మెరుగుపడ్డాక ఆనాటి ప్రముఖ హాస్య నటుడు కస్తూరి శివరావు నుంచి బజుల్లా రోడ్డులోని ఇంటిని 1953లో కొనుగోలు చేశారు. రెండంతస్థుల ఆ ఇంటికి కొద్దిగా మెరుగులు దిద్ది నివాసం, ఆఫీస్ అక్కడే ఏర్పాటు చేసుకున్నారు. గేటు దాటి ప్రవేశించగానే రెండు ఏనుగుల బొమ్మలు అందంగా కనిపించేవి. మిద్దెపైన పిల్లల గదులు, ఆయన బెడ్రూం ఉండేది. కింద పోర్షన్లో ఆఫీస్, సందర్శకుల కోసం మరో గది, మేకప్ రూం ఉండేవి. కంటిచూపు సరిగా కనపడని ప్రసాద్ అనే వ్యక్తి ఆయనకు మేనేజర్గా వ్యవహరించేవారు. ఆయన్ను ‘కళ్లజోడు' ప్రసాద్ అని పిలిచేవారు. ఎన్టీఆర్ కూర్చునే గదిలో తల్లిదండ్రుల ఫోటో, ఆరుగురు కూర్చునే సోఫా, ఆయన కోసం ఒక విలాసవంతమైన కుర్చీ ఉండేది.
ఫ్యాన్స్ షూటింగ్ చూసేందుకు ఏర్పాట్లు
ఎన్టీఆర్ నిత్యం తెల్లవారుజామున 3.30 గంటలకు నిద్ర లేచేవారు. మేడపై నుంచి దిగుతూ గట్టిగా గొంతు సవరించుకునేవారు. అది వినపడగానే ఆయన కోసం వేచి ఉండే వారు అప్రమత్తం అయ్యేవారు. తనను కలిసేందుకు వచ్చిన వారితో మాట్లాడిన తర్వాత ఉదయం ఆరు గంటలకుకొద్దిగా చికెన్తో కలిపి భోజనం చేసేవారు. ప్రతి రోజూ టీడీపీ వ్యవస్థాపకుడు, ఉమ్మడి రాష్ట్ర మాజీ సీఎం ఎన్టీఆర్ ఉదయం ఏడు గంటలకు మేకప్తో బయటకు వచ్చి మెయిన్ గేటు తెరవాలని ఆదేశించటమే ఆలస్యం. అప్పటికే అక్కడ గుమికూడిన అభిమానులు ఇంటి వరండాలోకి చేరుకునేవారు. రెండు చేతులూ జోడించి వారికి నమస్కరిస్తూ ‘ఏ ఊరు మనది..?' అంటూ గంభీరంగా ప్రశ్నించేవారు. ‘షూటింగ్ చూస్తారా...?' అని అభిమానులను ప్రశ్నించి అందుకు ఏర్పాట్లూ చేసేవారు.
ఎన్టీఆర్ దిన చర్య ఇలా
భక్తి ప్రపత్తులు ఎక్కువగా కలిగిన ఎన్టీఆర్కు చాలా సెంటిమెంట్లు ఉండేవి. ఆదివారం పూర్తిగా ధవళ వస్త్రాలు ధరించి నుదుటిన అడ్డంగా విభూది పెట్టుకునేవారు. ఎవరికైనా ఆర్థిక సాయం చేయదలిస్తే తన చేత్తో కాక భార్య బసవతారకం, ఇతరుల చేతుల మీదుగా అందించేవారు. వారు అందుబాటులో లేకుంటే సమీపంలోని కుర్చీపై గానీ, గోడపై గానీ ఉంచి డబ్బును ఉంచి తీసుకోమనేవారు. ప్రతిరోజూ రాత్రి 8.30 గంటలకు నిద్ర పోవడానికి ముందుగా చపాతీ తిని పాలు తాగేవారు. ప్రతి రోజూ నేలపైనే పడుకునేవారని ఆయన సన్నిహితులు చెబుతారు.
సర్దుకుపోవాలని ఏఎన్నార్కు ఎన్టీఆర్ స్నేహహస్తం
ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వర్ రావు మధ్య వృత్తిపరమైన విభేదాలు తలెత్తినప్పుడు ప్రేమాభిషేకం చిత్రం వారిని తిరిగి కలిపింది. ఈ సినిమా కచ్చితంగా ఏడాది ఆడుతుందని, ఏఎన్నార్ గ్రేట్ అని ఎన్టీఆర్ ప్రశంసించారు. ఊటీలో షూటింగ్లో ఉన్న ఏఎన్నార్కు ఫోన్ చేసి సినిమా సూపర్హిట్ అని చెప్పారు. ప్రొడక్షన్ వాళ్లు యావరేజ్ అంటున్నారని అక్కినేని చెప్పగా, లేదు సూపర్ హిట్ అవుతుందని చెప్పి తన ఇంటికి భోజనానికి ఆహ్వానించారు. ఈ సినిమాలో హీరోగా తాను కూడా చేయలేనని చెప్పి ఎన్టీఆర్ గొప్ప మనసు చాటుకున్నారు. ‘బ్రదర్.. మన ఇద్దరి మధ్య ఎవరెవరో ఏదో పెడుతుంటారు. మనం సర్దుకుపోవాలి' అని ఏఎన్నార్కు స్నేహహస్తం అందించారు.