Raghurama : వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలిచే సీట్లివే! రఘురామ తాజా రిపోర్ట్..!
ఏపీలో వచ్చే ఎన్నికల్లో అధికార వైసీపీ అధికారం నిలబెట్టుకుంటామని ధీమా వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు వరుసగా ఆ పార్టీ గెలవబోయే స్ధానాలపై నివేదికలు విడుదల చేస్తున్నారు.
ఏపీలో వచ్చే ఎన్నికల్లో వైసీపీ 175కు 175 స్ధానాలు గెలుస్తుందని సీఎం జగన్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. అంతే కాదు 175 సీట్లు గెలిచేలా ఏం చేయాలో కూడా వైసీపీ ఎమ్మెల్యేలు, నేతలతో నిత్యం సమీక్షలు జరిపి సలహాలు ఇస్తున్నారు. తద్వారా 175 సీట్ల మార్క్ వారికి నిత్యం గుర్తుండేలా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామ రాజు వైసీపీ వాస్తవంగా గెలిచే స్దానాలు ఇవేనంటూ కొంతకాలంగా రిపోర్టులు ఇస్తున్నారు. ఇందులో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు ఓటమిపాలవుతారని కూడా చెప్పేస్తున్నారు. ఇదే క్రమంలో తాజాగా మరో రిపోర్ట్ ఇచ్చారు.
రానున్న ఎన్నికల్లో వైసీపీ 25 స్థానాల్లో కూడా గెలవడం కష్టమేనంటూ రెబెల్ ఎంపీ రఘురామరాజు తాజాగా ఇవాళ ప్రకటించారు. మనకు మనమే వై నాట్ 175 అనుకుంటే.. ఆస్థానాలు మరిన్ని తగ్గే ప్రమాదం ఉందంటూ మరో బాంబు పేల్చారు. రానున్న ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ 25 స్థానాలలో కూడా గెలవడం కష్టమేనని పందెం రాయుళ్లు పందాలు కాస్తున్నట్లుగా రఘురామ వెల్లడించారు. మనకు మనమే సింహాలమని, వై నాట్ 175 అని బీరాలు పోతే , ఆ 25 స్థానాలు మరింత తగ్గే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

తన పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ స్థానాలలో ప్రతిపక్ష కూటమి అభ్యర్థులు 30 వేల ఓట్ల మెజారిటీతో గెలుస్తారని పందెం రాయుళ్ళు ఇప్పటికే పందాలు కాస్తున్నట్లు తెలిసిందని రఘురామ తెలిపారు. తమ జిల్లాతో పాటు, పొరుగు జిల్లాలలో కూడా ఇదే పరిస్థితి నెలకొందన్నారు. చంద్రబాబు రోడ్ షోలకు హాజరవుతున్న జన సందోహాన్ని చూసైనా ఆత్మ స్తుతి పరనిందను మాని , ప్రజలు ఎందుకు మనకు దూరం అవుతున్నారో ఆత్మావలోకనం చేసుకోవాలని వైసీపీ నేతలకు సూచించారు.
మరో ఆరు నెలల వ్యవధిలో ఎన్నికలు జరగనున్న తరుణంలో గతంలో ఎప్పుడూ లేనంతగా ఇసుక వేస్తే రాలనంత జనం ప్రతిపక్ష నేత సభలకు హాజరవుతున్నారంటే ప్రజాభిప్రాయం ఏమిటో స్పష్టమవుతోందన్నారు. మనల్ని ఎవరూ నమ్మనప్పుడు మా నమ్మకం నువ్వే జగనన్న అని ప్రతి ఇంటికి స్టిక్కర్ అతికిస్తానంటే, బదులుగా ప్రతిపక్షాలు మా దరిద్రం నీవే అని ఓ రాజకీయ పార్టీగా స్టిక్కర్లు అతికిస్తామని చెబుతున్నారన్నారు. ఇప్పటికైనా ఇంటింటికి స్టిక్కర్లు అతికించే కార్యక్రమాన్ని వాయిదా వేసుకుంటే మంచిదని సూచించారు. ప్రతిపక్ష నేతల సభలు, సమావేశాలకు ఆటంకాలు కలిగిస్తే ప్రజల్లో వారికి ఆదరణ పెరుగుతుందనే విషయాన్ని గుర్తించాలన్నారు.












Click it and Unblock the Notifications