సభలో పాలు: 'కేరళలో హెరిటేజ్ బ్యాన్, టీలో మాటేమిటి'
త్వరగా పాలను సేకరించాలన్న దురుద్దేశంతో పాడి పరిశ్రమ రైతులు గేదెలకు ఆక్సిటోసిన్ ఇంజక్షన్లు ఇస్తున్నారని, ఆక్సిటోసిన్ కలిగిన పాలతో తీవ్ర దుష్పరిణామాలు ఉంటాయన్నారు. సభ ప్రారంభం కాగానే ప్రశ్నోత్తరాల సమయంలో భాగంగా రవీందర్ రెడ్డి ఈ అంశాన్ని లేవనెత్తారు.
గ్రామీణ ప్రాంతాల్లో సరిపడినంత మంది పశువైద్య నిపుణులు, సహాయక సిబ్బంది లేని కారణంగానే ఈ తరహా వ్యాపారం విస్తరిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస రెడ్డి స్పందించారు. పాల కల్తీని అడ్డుకుంటామన్నారు. త్వరలోనే పశువైద్య శాఖ ఖాళీలను భర్తీ చేస్తామన్నారు.
పాల కల్తీ పైన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే గీతా రెడ్డి అన్నారు. పాలను కల్తీ చేయడం హేయమైన చర్య అన్నారు. హెరిటేజ్ పాలను కేరళ రాష్ట్రంలో నిషేధించారని ఎమ్మెల్యే రెడ్యా నాయక్ చెప్పారు. తెలంగాణలో హెరిటేజ్ పాల సంగతి ఏమిటని ఆయన ప్రశ్నించారు.
పాల పైన వ్యాట్ తగ్గించాలని డిప్యూటీ సీఎం రాజయ్య అన్నారు. పాలను కల్తీ చేస్తున్న వారి పైన చర్యలు తీసుకోవాలని టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. పశువైద్య శాఖలో తగిన సిబ్బంది లేక అందరు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు.
కాగా, బుధవారం ఉదయం 10 గంటలకు ప్రారంభం కాగానే విపక్షాలు ప్రతిపాదించిన వాయిదా తీర్మానాలను తిరస్కరించిన స్పీకర్ మధుసూదనాచారి ప్రశ్నోత్తరాలను చేపట్టారు. బీసీ సబ్ ప్లాన్ పై టీడీపీ, పెన్షన్ల మంజూరులో నెలకొన్న జాప్యంపై బీజేపీ, ఇందిరమ్మ ఇళ్ల బకాయిలపై సీపీఐ, భూపంపిణీపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలు వాయిదా తీర్మానాలను అందించాయి.