ప్రాంతీయ మండళ్లకు రంగం సిద్దం - సీనియర నేతలకు ప్రాధాన్యత : పాలనలో కీలకంగా..!!
ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు తరువాత మరో కీలక నిర్ణయం దిశగా కసరత్తు జరుగుతోంది. ఇప్పటికే కొత్త జిల్లాల ఏర్పాటు..కేబినెట్ విస్తరణ.. ఇంఛార్జ్ మంత్రుల నియామకం.. పార్టీ జిల్లా అధ్యక్షులు - రీజనల్ కో ఆర్డినేటర్ల బాధ్యతల కేటాయింపు పూర్తి కావటంతో..ఇక, ఇప్పుడు ప్రాంతీయ మండళ్ల ఏర్పాటు పైన నిర్ణయం సిద్దం అవుతున్నట్లు తెలుస్తోంది.
ఏపీలో అధికారంలోకి వచ్చిన తరువాత ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటు దిశగా ప్రయత్నాలు చేసింది. అయితే, న్యాయ పరమైన సమస్యలతో మూడు రాజధానులు ఆచరణ అమలు కాలేదు. కానీ, ప్రభుత్వం మాత్రం తమ విధానం మూడు రాజధానులే అని స్పష్టం చేస్తోంది.
కొత్తగా డెవలప్ మెంట్ రీజనల్ బోర్డులు
ఇక, ఎన్నికలకు సిద్దం అవుతున్న సీఎం జగన్ ఈ సమయంలోనే అధికార వికేంద్రీకరణ పేరుతో 13 జిల్లాలను 26 జిల్లాలుగా మార్చారు. అన్ని జిల్లాలకు ఇంఛార్జ్ మంత్రలను నియమించారు. పార్టీ పరంగానూ ప్రతీ జిల్లాకు అధ్యక్షుడు.. ప్రాంతీయ సమన్వయకర్తలను ఖరారు చేసారు.
ఇప్పుడు అదే ప్రాంతీయ సమీకరణాలతో ప్రాంతీయ మండళ్ల ఏర్పాటుకు రంగం సిద్దం చేస్తున్నారు ఈ నెలాఖరులోగా ప్రాంతీయ మండళ్లను ఏర్పాటు చేసేలా కసరత్తు జరుగుతున్నట్లు సమాచారం. గతంలో వైఎస్సార హయాంలోనే ప్రాంతీయ మండళ్లు ఏర్పాటు అయ్యాయి. వాటి పదవీ కాలం ముగిసిన తరువాత తిరిగి వాటి ఏర్పాటు పైన ఎవరూ మరోసారి ఆలోచన చేయలేదు.
ఛైర్మన్లుగా సీనియర్ నేతలకు అవకాశం
ఇక, ఇప్పుడు మొత్తం 26 జిల్లాలకు అయిదు నుంచి ఆరు ప్రాంతీయ మండళ్ల ఏర్పాటు అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. మంత్రి హోదా కట్టబెడుతూ.. ప్రాంతీయ మండలి ఛైర్మన్లను నియమించనున్నారు. అదే విధంగా ప్రాంతీయ మండలి పరిధిలోకి వచ్చే ప్రాంతాలకు చెందిన వారిని సభ్యులుగా నియమించేందుకు కసరత్తు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
మంత్రి పదవులు ఆశించి రాని వారు.. పార్టీలో తొలి నుంచి ఉన్న వారికి ఛైర్మన్లుగా - పార్టీ కోసం నిలబడిన వారికి సభ్యులుగానూ అవకాశం కల్పించనున్నట్లు చెబుతున్నారు. అందులో భాగంగా ఉత్తరాంధ్ర నుంచి చిత్తూరు వరకు మొత్తం 26 జిల్లాలను ఆరు బోర్డులుగా ఏర్పాటు చేస్తారనేది ప్రాధమిక సమాచారం.
నెలాఖరులోగా ప్రక్రియ పూర్తి చేసేలా..
ఈ బోర్డులు జిల్లాల మంత్రులు..ఇంఛార్జ్ మంత్రులో నిరంతరం సమావేశాలు నిర్వహిస్తూ.. ప్రభుత్వానికి పాలనలో కీలకంగా వ్యవహరించనున్నాయి. ఉత్తరాంధ్ర జిల్లాలు.. విశాఖ కు ప్రత్యేకంగా.. గోదావరి జిల్లాలతో కలిపి ఒక మండలి... క్రిష్ణా - గుంటూరు జిల్లాల తో ప్రాంతీయ మండలి ఏర్పాటు చేస్తున్నట్లుగా సమాచారం.
అదే విధంగా ప్రకాశం - నెల్లూరు జిల్లాలతో మరో బోర్డు...ఇక, రాయలసీమలో రెండు బోర్డులు ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. స్థానిక ప్రాధాన్యతలు...ప్రభుత్వ పరంగా చేపట్టాల్సిన కార్యక్రమాల పైన ఈ బోర్డుల సూచనలు కీలకంగా మారనున్నాయి. ఈ నెలాఖరులోగా ఈ బోర్డుల ఏర్పాటు కొలిక్కి వచ్చి..అధికారికంగా ప్రకటించే ఛాన్స్ ఉందని పార్టీలో చర్చ సాగుతోంది. దీంతో..వీటిల్లో ఎవరికి అవకాశం దక్కుతుందనేది ఇప్పుడు పార్టీలో ఆసక్తి కర చర్చకు కారణమవుతోంది.