ఇక...సిఆర్డీఏ ప్లాట్లు...ఆన్లైన్లోనే రిజిస్ట్రేషన్లు...నేటి నుంచే అమలు...
అమరావతి: రాజధాని రైతులకు ఇచ్చిన రిటనబుల్ ప్లాట్ల రిజిస్ట్రేషన్ విధానంలో సీఆర్డీయే కీలక మార్పు తీసుకొస్తోంది. తదనుగుణంగా ల్యాండ్ పూలింగ్ డిప్యూటీ కలెక్టర్లు, సిబ్బందికి విజయవాడ సీఆర్డీయే కార్యాలయంలో రెండురోజులు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
సిఆర్డీఏ ఇప్పటి వరకు అమలు చేస్తున్న విధానం ప్రకారం రాజధాని ప్రాంతంలోని రైతు తన భూమిని సీఆర్డీయేకి రిజిస్ట్రేషన్ చేయాలి. సిఆర్డిఏ అదే రోజు రైతుకు రిటర్నబుల్ ప్లాటును రిజిస్ట్రేషన్ చేస్తుంది. అయితే సిఆర్డిఏ నూతనంగా జనవరి 22 నుంచి అమలు చేయనున్న విధానంలో రైతులు సీఆర్డీఏకి భూమి చేయాల్సిన అవసరం లేదు. ముందుగా ఇచ్చిన వివరాల ఆధారంగా సీఆర్డీయేనే నేరుగా ప్లాటును రిజిస్ట్రేషన్ చేస్తుంది.
సీఆర్డీఏ పరిధిలో ప్లాట్ల రిజిస్ట్రేషన్లు ఊపందుకోవటంతో రైతుల సమయం ఎక్కువ తీసుకోకుండా, వారు ఈ ప్రక్రియ కోసం పడిగాపులు గాయకుండా ఈ విధానాన్ని ప్రవేశపెట్టినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ విధానంలో ప్లాటు రిజిస్ట్రేషన్ చేసుకునే రైతు ముందుగా ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకోవాలి. సీఆర్డీయే వెబ్సైట్లోకి వెళ్లి స్లాట్ బుక్ చేసుకొని అందులో ప్లాటు, రైతు వివరాలు నమోదు చేస్తే చాలు, రిజిస్ట్రేషన్ ఏ రోజో వెంటనే రైతు ఫోన్కి సమాచారం వస్తుంది. ఆ రోజు రైతు నేరుగా రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లి హెల్ప్ డెస్క్లో తన ఒరిజినల్ పత్రాలు అందజేస్తే ఆ వెంటనే ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేస్తారు. ఈ పక్రియ సోమవారం నుంచి అమలులోకి వస్తుందని సిఆర్డిఏ ల్యాండు పూలింగ్ అధికారులు చెబుతున్నారు.