దమ్ముంటే రా: రాంరెడ్డి, ఒంటరిగా వస్తా: రేణుకా చౌదరి
హైదరాబాద్: దమ్ముంటే కాంగ్రెసు పార్టీ రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి తెలంగాణ జైత్రయాత్రకు రావాలని మంత్రి రాంరెడ్డి వెంకట రెడ్డి సవాల్ విసరగా, తాను ఒంటరిగా వస్తానని ఎవరు అడ్డుకుంటారో చూస్తానని రేణుకా చౌదరి ప్రతి సవాల్ విసిరారు. ఖమ్మం జిల్లాకు చెందిన రేణుకా చౌదరి, రాంరెడ్డి వెంకట రెడ్డిల మధ్య ఇటీవల మాటల యుద్ధం కొనసాగుతున్న విషయం తెలిసిందే.
ఈ నెల 21న జరిగే తెలంగాణ జైత్ర యాత్ర సభకు దమ్ముంటే రావాలని రాంరెడ్డి దామోదర్ రెడ్డి సవాల్ విసిరారు. ఆమె తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పి సభకు రావాలని, లేకుంటే అడ్డుకుంటారని హెచ్చరించారు. ఆయన సవాలుకు రేణుకా చౌదరి కూడా అంతే దీటుగా స్పందించారు.
తెలంగాణ జైత్రయాత్ర సభకు ఒంటరిగానే వస్తానని, అడ్డుకోమనండి చూస్తానన్నారు. హైదరాబాద్లో తెలంగాణ కాంగ్రెస్ ప్రతినిధులతో జరిగిన సమావేశానికి రేణుకాచౌదరి సిగ్గులేకుండా వచ్చారని రాంరెడ్డి దామోదర్ రెడ్డి దుయ్యబట్టారు.
కాగా, ఇటీవల కాంగ్రెసు పార్టీ రేణుకా చౌదరి ఖమ్మం జిల్లా ఆడబిడ్డ ఎలా అవుతుందో నిరూపించుకోవాలని, ఆమె తెలంగాణ ఆడబిడ్డగా సర్టిఫికేట్ తెచ్చుకోవాలని రాంరెడ్డి వెంకట రెడ్డి ఎద్దేవా చేసిన విషయం తెలిసిందే. ఆడబిడ్డల మనోభావాలను దెబ్బతీసే హక్కు ఎవరికీ లేదన్నారు. ఈ నెల 21న ఖమ్మంలో జరిగే సమావేశానికి రేణుకను ఆహ్వానించే విషయంలో తెలంగాణ ప్రాంత మంత్రుల కమిటీ నిర్ణయిస్తుందని చెప్పారు. ఆడబిడ్డ అనే పదానికి ఎంతో గౌరవముందని, రేణుకా చౌదరి ఖమ్మం ఆడబిడ్డ అయితే నిరూపించుకోవాలన్నారు.