కరెక్షన్.. కియా: ట్వీట్ డిలేట్ చేసిన రాయిటర్స్..!
అమరావతి: కొద్ది రోజులుగా రాష్ట్రంలో రాజకీయంగా తీవ్రస్థాయిలో దుమారానికి దారి తీసిన వివాదం.. కియా మోటార్స్. అనంతపురం జిల్లా పెనుకొండలో చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఏర్పాటైన ఈ సంస్థ తమిళనాడుకు తరలిపోయే అవకాశం ఉందంటూ అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్స్ చేసిన ఓ ట్వీట్ దీనికి కారణమైంది. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష తెలుగుదేశం మధ్య ఆకాశమే హద్దుగా విమర్శలు, ప్రతి విమర్శలకు కారణమైన ట్వీట్ అది.
దీన్ని శనివారం తొలగించింది రాయిటర్స్ వార్తా సంస్థ. ఈ ట్వీట్ను డిలేట్ చేస్తున్నట్లు వెల్లడించింది. ట్వీట్ను తొలగించడానికి గల కారణాన్ని కూడా వివరించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన వివరణను దృష్టిలో ఉంచుకుని ట్వీట్ను తొలగిస్తున్నట్లు పేర్కొంది. ఇదివరకు తాము చేసిన ట్వీట్ సరైనది కాదని ప్రకటించింది. సరైన ట్వీట్ కాకపోవడం వల్లే దాన్ని డిలేట్ చేస్తున్నట్లు రాయిటర్స్ వార్తా సంస్థ స్పష్టం చేసింది.
https://twitter.com/ReutersIndia/status/1226052101299675136?s=20
కియా వార్తా సంస్థ ఎక్కడికీ వెళ్లట్లేదంటూ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఇదివరకే వెల్లడించారు. ఆటో ఎక్స్పో సందర్భంగా ఆయన కియా మోటార్స్ సంస్థ ప్రతినిధులతో భేటీ అయ్యారు. కియా మోటార్స్ ఇండియా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సైతం దీనిపై ఓ స్పష్టమైన ప్రకటన చేశారు. కియా కార్ల తయారీ కేంద్రాన్ని ఎక్కడికీ తరలించట్లేదని, రాయిటర్స్ వార్తా సంస్థ చేసిన ట్వీట్ నిరాధారమైనదని వెల్లడించారు.