బెజవాడలో రాజధాని ఎందుకో: సుమన్, రేవంత్పై ఫైర్
హైదరాబాద్: శివరామకృష్ణన్ కమిటీ వద్దన్నా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజయవాడలోనే రాజధానిని ఎందుకు పెడుతున్నారో సమాధానం చెప్పాలని తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపీ బాల్క సుమన్, ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావులు గురువారం ప్రశ్నించారు. తెలంగాణలోని భూములను గత ప్రభుత్వాలు కేటాయించిన విధానం పైన లోతుగా చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలంగాణ టీడీపీ నేత రేవంత్ రెడ్డికి వారు సవాల్ చేశారు.
టీడీపీ, కాంగ్రెసు ప్రభుత్వాలు 1995 నుండి 2014 వరకు చేసిన ప్రతి భూకేటాయింపు పైన సమగ్ర సమీక్ష చేయాల్సి ఉందన్నారు. తెలంగాణ ప్రభు్తవం దీని పైన శాసన సభా సంఘం వేయాలని తాము కోరుతున్నామని, శాసన సభ సమావేశాలు ప్రారంభమైన తర్వాత కూడా తాము దీని పైన చర్చిస్తామన్నారు. శాసన సభ సంఘాన్ని వేసి ఎక్కడ అక్రమాలు జరిగాయో తేల్చాల్సిన అవసరముందని చెప్పారు.

మెట్రోకు కేటాయించిన భూములను మైహోం గ్రూపునకు చెందిన అక్వాస్పేస్ సంస్థకు తెలంగాణ ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా కేటాయించినట్లుగా రేవంత్ రెడ్డి ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఈ భూములకు సంబంధించి సంబంధిత సంస్థకు పాత ప్రభుత్వాలే అనుమతులు ఇవ్వడంతో పాటు మినహాయింపులు ఇచ్చిందని గుర్తు చేశారు. ఒక అబద్దాన్ని వందసార్లు చెబితే నిజమవుతుందని రేవంత్ భావిస్తున్నారని, ఆయనకు దమ్ముంటే తమతో చర్చకు రావాలని సవాల్ విసిరారు.
రేవంత్ తెలంగాణ ప్రభుత్వం పైన అసత్య ఆరోపణలు చేస్తున్నారన్నారు. చంద్రబాబు హయాంలో జరిగిన అవినీతి పైన ప్రపంచం కోడై కూస్తోందని విమర్శించారు. బీజేపీ సైతం గతంలో చంద్రబాబు అవినీతి పైన ప్రజా బ్యాలెట్ నిర్వహించిందని, ఇప్పుడు టీడీపీతోనే కలిసిందని ఎద్దేవా చేశారు.












Click it and Unblock the Notifications