కేసీఆర్ మండిపడే రేవంత్కి తెరాస ఎంపీ కితాబు! టీకి బాబు ఆఫర్..
హైదరాబాద్: తెలంగాణ తెలుగుదేశం పార్టీ శాసన సభ్యుడు రేవంత్ రెడ్డి అంటేనే తెలంగాణ రాష్ట్ర సమితికి ఆగ్రహం అనే విషయం తెలిసిందే. ఎన్నికల అనంతరం ఇతర టీడీపీ నేతల కంటే రేవంత్ రెడ్డియే ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును, తెరాస ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు.
తెరాస కూడా మిగతా నేతల కంటే రేవంత్ పైనే ఎక్కువగా దృష్టి సారించిన సందర్భాలు ఉన్నాయి. అసెంబ్లీ నడుస్తున్న సమయంలో రేవంత్ తీవ్ర ఆరోపణలు చేస్తే.. ఆయనకు ప్రభుత్వం మైకు కూడా ఇవ్వలేదనే ఆరోపణలు ఉన్నాయి. టీడీపీ వర్సెస్ తెరాస కాకుండా.. రేవంత్ వర్సెస్ తెరాసగా కనిపించిన సందర్భాలు ఎన్నో.
అయితే, అలాంటి రేవంత్ రెడ్డికి తెరాస ఎంపీ బూర నర్సయ్య గౌడ్ కితాబిచ్చారు. రేవంత్ తెలివైనవాడని, మంచి నేత అని కానీ అతను రైట్ మెన్ ఇన్ రాంగ్ పార్టీ అన్నారు.
తెలంగాణకు చంద్రబాబు కరెంట్!
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జలం, విద్యుత్.. ఇలా పలు అంశాల పైన వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఏపీ సీఎం చంద్రబాబు ముందుచూపుతో ఇతర రాష్ట్రాల నుండి విద్యుత్ కొన్నారని, తెలంగాణ సీఎం కేసీఆర్కు ఆ ముందుచూపు లేకపోవడంతో ఇప్పటికీ విద్యుత్ కష్టాలు కొనసాగుతున్నాయని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
ఇదిలా ఉండగా.. తెలంగాణలో ఇటీవలి వరకు విద్యుత్ కొరత బాగా కనిపించింది. ఇప్పుడే ఇలా ఉంటే ఎండాకాలంలో ఇంకెంత ఉంటుందో అని ఆందోళన చెందారు. దీనిపై ఎర్రబెల్లి దయాకర రావు మాట్లాడుతూ.. రానున్న వేసవిలో తెలంగాణకు చంద్రబాబు కరెంట్ సరఫరా చేస్తారని చెప్పారు.
గతంలోను చంద్రబాబు కరెంట్ ఇస్తామని చెప్పారని, అయితే చంద్రబాబుకు లేఖ రాయడానికి కేసీఆర్ సిగ్గుపడ్డారని ఎద్దేవా చేశారు. తనయుడు కేటీఆర్, అల్లుడు హరీష్ రావు చెప్పినప్పటికీ కేసీఆర్ పట్టించుకోలేదన్నారు. తెలంగాణకు ఏపీ నుండి విద్యుత్ ఇప్పించే బాధ్యతను ఇప్పుడు తాము తీసుకుంటామన్నారు.
కేసీఆర్ సోకులకే: మోత్కుపల్లి
కేసీఆర్ సోకులకే రాష్ట్ర ఖజానా ఖాళీ అవుతోందని తెలంగాణ టీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులు వేరుగా మండిపడ్డారు. తనకు కావాల్సిన వారి కోసమే సచివాలయం తరలింపు అని విమర్శించారు.
కేసీఆర్ నియంతృత్వ పోకడలకు గ్రేటర్ ఎన్నికలు అడ్డుకట్ట వేస్తాయన్నారు. పేద ప్రజల కోసం ఇప్పటి వరకు ఒక్క నిర్ణయం తీసుకోలేదన్నారు. ఇప్పటికైనా కళ్లు తెరవాలన్నారు. రాష్ట్ర ఖజానాను ఆయన తన సోకుల కోసం వినియోగిస్తున్నారని ఆరోపించారు. రైతులు చనిపోతే పట్టించుకోలేదని, ఇప్పటి వరకు ఒక్క ఇల్లు కూడా కట్టించలేదన్నారు.