మందేసే వాళ్లకేం తెలుసు కేటీఆర్ సారీ చెప్పాలి: రేవంత్
హైదరాబాద్: హెరిటేజ్ పాల విషయంలో తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి, తెరాస సభ్యుల మధ్య బుధవారం తీవ్ర వాగ్వాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఏ రాష్ట్రమైతే హెరిటేజ్ పాలను నిషేధించిందో.. ఆ పాలను స్వేచ్ఛగా అమ్ముకునేందుకు అనుమతించిందని రేవంత్ రెడ్డి మీడియా పాయింట్ వద్ద చెప్పారు.
శాసన మండలి ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ నేతల నుండి ముడుపులు తీసుకొని ఓటు వేసి నిషేధానికి గురైన రవీందర్ రెడ్డి నిషేధం గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. హరీష్ రావుకు వాటాలు ఇచ్చావు, కేటీఆర్కు ఎందుకు ఇవ్వలేదని ఏనుగు రవీందర్ రెడ్డిని పార్టీ సస్పెండ్ చేయలేదా అని ప్రశ్నించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ లాగే ఆయన తనయుడు మంత్రి కల్వకుంట్ల తారక రామారావు కూడా నిరంతరం అబద్దాలు చెబుతున్నారన్నారు. సజావుగా జరుగుతున్న సభలో కావాలనే తెరాస సభ్యులు గందరగోళం సృష్టిస్తున్నారన్నారు. ఆంగ్లో ఇండియన్ అంటూ తెలంగాణ ప్రజలను అవమానించే విధంగా వ్యాఖ్యలు చేసిన కేటీఆర్ క్షమాపణ చెప్పాలన్నారు.
మధ్యాహ్నం రెండు గంటల్లోగా క్షమాపణలు చెప్పకపోతే న్యాయపోరాటానికి సిద్ధమని ప్రకటించారు. కేటీఆర్ పైన సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇస్తామని చెప్పారు. కేటీఆర్ పైన చర్యలు తీసుకోకుంటే సభాపతి పైన అవిశ్వాస తీర్మానం పెడతామని రేవంత్ రెడ్డి చెప్పారు. పాల గురించి మందు తాగే వాళ్లకు ఏం తెలుసునని ప్రశ్నించారు. కేటీఆర్ శాసన సభ్యత్వం రద్దు చేయాలన్నారు.
సభలో హెరిటేజ్ పాల విషయమై ఎమ్మెల్యే రవీందర్ రెడ్డి ప్రస్తావించడం పైన మంత్రి రాజయ్య స్పందించారు. కేరళలో హెరిటేజ్ పాలను నిషేధించిన అంశం తమ దృష్టికి వచ్చిందన్నారు. ఆహార నాణ్యత, ప్రమాణాల చట్టం ప్రకారం నమూనాలు పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు.
తెరాస సభ్యులు కావాలనే హెరిటేజ్ పైన అసత్య ఆరోపణలు చేస్తున్నారని టీడీపీ సభ్యులు మండిపడ్డారు. దీంతో తెరాస కూడా అగ్రహం వ్యక్తం చేసింది. మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. సభలో కొందరు టీడీపీ సభ్యులు హెరిటేజ్ ప్రతినిధులు, డైరెక్టర్లుగా మాట్లాడుతున్నారని విమర్శించారు. సభలో గందరగోళం చెలరేగటంతో రెండుసార్లు వాయిదా పడి, మళ్లీ ప్రారంభమైంది.
ఆంధ్రాబాబుల చేతిలోని రిమోట్ కంట్రోల్తో తెలంగాణ శాసనసభలో బొమ్మలు ఆడుతున్నాయని బుధవారం తెరాస ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి మీడియా పాయింట్ వద్ద అన్నారు. చంద్రబాబు రిమోట్ కంట్రోల్తో తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకరరావులతో బొమ్మలాట ఆడిస్తున్నారన్నారు.
మాయల పకీరు ప్రాణం చిలుకలో ఉన్న చందంగా... రేవంత్ రెడ్డి, ఎర్రబెల్లిల ప్రాణాలు చంద్రబాబు గుప్పిట్లో ఉన్నాయన్నారు. తెలంగాణ ప్రజల సంక్షేమాన్ని విస్మరించిన వారు బాబు డైరెక్షన్లో తెలంగాణ సర్కారుపై ఎగురుతున్నారన్నారు. ఆంధ్రా పెత్తనాన్ని ఇకపై ఎంతమాత్రం సహించబోమని ఆయన వెల్లడించారు.