కేసీఆర్కు ధీటుగా రేవంత్ రెడ్డి స్పీడ్, సీఎం పదవి కోరిక..
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర శాసన సభ నుండి తమను సస్పెండ్ చేయడం పైన తెలుగుదేశం పార్టీ శాసన సభ్యులు తెలంగాణ రాష్ట్ర సమితి, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. సభలో తమను సస్పెండ్ చేయడంతో వారు బయట ప్రభుత్వం పైన పోరు చేస్తున్నారు. టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి అయితే కేసీఆర్ పైన నిప్పులు కక్కుతున్నారు.
తమను సస్పెండ్ చేయడం అన్యాయమని, ప్రభుత్వం పునరాలోచించాలని టీడీపీ సభ్యులు చెబుతున్నారు. శుక్రవారం నాడు తెలంగాణలో పలుచోట్ల టీడీపీ ఆందోళనలు చేపట్టింది. జనగామలో ఎర్రబెల్లి దయాకర రావును పోలీసులు అరెస్టు చేసి విడుదల చేశారు. హైదరాబాదులో అసెంబ్లీ ప్రాంగణంలోని మీడియా పాయింట్ వద్ద కొందరు టీడీపీ సభ్యులు ప్రభుత్వంపై దుమ్మెత్తి పోశారు. కొందరు సభాపతిని కలిసి సస్పెన్షన్ ఎత్తివేయాలని కోరారు.
సాయంత్రం టీడీపీ సభ్యులు గవర్నర్ నరసింహన్ను కలిశారు. తమ సస్పెన్షన్ పైన ఆయన దృష్టికి తెచ్చారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడారు. టీడీపీ సభ్యులను సస్పెండ్ చేయడం అప్రజాస్వామికమని, అధికారపక్షం తమ గొంతు నొక్కే ప్రయత్నాలు చేస్తోందని గవర్నర్కు ఫిర్యాదు చేశామని చెప్పారు. తెరాస సభలో హుందాగా ప్రవర్తించడం లేదన్నారు.
నిజామాబాద్ ఎంపీ కవిత పైన రేవంత్ రెడ్డి ప్రశ్న మాత్రమే వేశారని, పత్రికలో వచ్చింది నిజమేనా అడి అడిగితే తప్పా అని ప్రశ్నించారు. కేసీఆర్ పెత్తందారీ విధానం సభలోను స్పష్టంగా కనిపిస్తోందని ఆరోపించారు. రూ.లక్ష కోట్ల బడ్జెట్ పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారన్నారు.
అంతకుముందు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పైన ఒంటికాలి పైన లేచారు. ప్రశ్నోత్తరాల సమయంలో ప్రశ్న అడిగితే తప్పా అని, తాను కవిత పేరును చెప్పలేదని, నిజామాబాద్ ఎంపీగారు అన్నానని, ఆధారాలతోనే తాను ప్రశ్నించానని, అయినా ప్రశ్నోత్తరాల సమయంలో పత్రికల్లో వచ్చిన దాని పైన వివరణ ఇవ్వాలని కోరడం తప్పా అని ప్రశ్నించారు.
కవిత గురించి ప్రశ్నిస్తే కేసీఆర్ ఆవేదన చెందానని చెబుతున్నారని, మరి మరో అమ్మాయితో తన పైన ఆరోపణలు చేయించారని, ఇది ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. ఆ అమ్మాయి తండ్రి ఆవేదన చెందడా అన్నారు. తాను కేసీఆర్, ఆయన కుటుంబం, తెరాస పైన పోరాడుతున్నందుకే తన పైన కక్ష కట్టారని వ్యాఖ్యానించారు. తమను బెదిరించలేరన్నారు. బెదిరిస్తే అంతకంటే ఉత్సాహంగా పని చేస్తామన్నారు.
కాగా, గత కొంతకాలంగా రేవంత్ రెడ్డి తెరాస ప్రభుత్వం పైన తన జోరు పెంచుతున్న విషయం తెలిసిందే. దీని పైన పలు రకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రజా సమస్యల పైన టీడీపీ ఎమ్మెల్యేలు అందరూ తెరాస ప్రభుత్వం పైన మాటల యుద్ధం చేస్తున్నారని, అయితే, రేవంత్ రెడ్డి కొంత జోరుమీదున్నారని అంటున్నారు. గతంలో ఒకటి రెండుసార్లు రేవంత్ రెడ్డి 'ముఖ్యమంత్రి' పదవి కోరికను వెలిబుచ్చారు. ఆ ఉద్దేశ్యంతోనే ఆయన తోటివారి కంటే దూకుడుగా వెళ్తున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.