కెసిఆర్ ఇలా: వీడియో టేప్ విడుదల చేసిన రేవంత్
హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ఈనెల 19న నిర్వహించనున్న సమగ్ర సర్వేపై ఎన్నో అనుమానాలు ఉన్నాయని తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకుడు రేవంత్ రెడ్డి అన్నారు. సర్వేపై తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు అధికారికంగా ఒక మాట, అనధికారంగా మరో మాట చెబుతున్నారని ఆయన ఆదివారం మీడియా సమావేశంలో విమర్శించారు.
అధికారులతో కేసీఆర్ సంభాషణను మీడియాకు వినిపించారు. "ఆంధ్రా ఉద్యోగులు, విద్యార్థులను వెళ్లగొట్టేందుకే ఈ సర్వే అని, డిస్కరేజ్ చేస్తే వారే ఇక్కడి నుంచి వెళ్లిపోతారని... నా పని సాఫ్ అయిపోతుందని... దీన్ని నేను మైకులు పెట్టి చెప్పలేనని.. మహబూబ్నగర్లో వలసలు లేవని, ఎవరికోసమో సర్వే అపలేమని... ఎస్సీ వర్గీకరణ అంశం వదిలేయాలని'' రహస్య సమావేశంలో అధికారులతో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ఆయన వినిపించారు.
పాలమూరు ప్రజలను కెసిఆర్ అవమానిస్తున్నారని, ఆయన ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని రేవంత్రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్ అపరిచితుడిలా అవతారాలు మారుస్తున్నారని ఆయన విమర్శించారు. తెలంగాణ వారితో సర్వే చేయించడం లేదని, సర్వే చేసేవారిలో 25 శాతం ఆంధ్రా ఉద్యోగులే ఉన్నారని ఆయన అన్నారు. ఎస్సీ వర్గీకరణను కూడా సర్వేలో చేర్చాలని రేవంత్రెడ్డి డిమాండ్ చేశారు.
సమగ్ర సర్వే వెనుక తెరాస ప్రభుత్వం కుట్ర ఉందని, తెలంగాణ ప్రజలకు సంక్షేమ పథకాలు నిలుపుదల చేయడానికే ఈ సర్వే అని, దీన్ని తెలంగాణ ప్రజలు గ్రహించకుండా ఉండేందుకు ఆంధ్రోళ్లకు వ్యతిరేకంగా రహస్య ప్రచారం చేస్తున్నారని రేవంత్రెడ్డి విమర్శించారు. 12 గంటల్లో 4 కోట్ల మంది సమాచారాన్ని ఎలా సేకరిస్తారని ఆయన ప్రశ్నించారు. సేకరణకు వచ్చిన ఎన్యుమరేటర్స్ సమాచారం కోసం బలవంతం చేస్తే కేసులు పెట్టాలని, మాదిగలంతా కెసిఆర్ను నిలదీయాలని రేవంత్రెడ్డి పిలుపు ఇచ్చారు.
సమగ్ర సర్వేకు ఒక్క రోజు ముందు కెసిఆర్ తన కుటుంబ ఆస్తులను వెల్లడించాలని రేవంత్రెడ్డి డిమాండ్ చేశారు. కెసిఆర్ తన కుటుంబ ఆస్తులు వెల్లడించరు గానీ ప్రజలు తమ ఆస్తుల వివరాలు వెల్లడించాలా? అంటూ ఆయన ప్రశ్నించారు. ప్రజలు ఇచ్చే సమాచారం దుర్వినియోగం అయితే కెసిఆర్ జైలుకు వెళతారా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.