అబద్ధాలు చెప్తున్నారు: మెట్రో రైలుపై రేవంత్ రెడ్డి
హైదరాబాద్: హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్ట్ స్థలాల బదలాయింపుపై తాను చేసిన ఆరోపణలపై ప్ర భుత్వం, అధికారులు తప్పుడు సమాచారంతో ప్రజలను మభ్యపెడుతున్నారని తెలంగాణ తెలుగుదేశం ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఆరోపించారు. తాను చేసిన ఆరోపణలపై పరువునష్టం దావా వేస్తే న్యాయపరంగా ఎదుర్కొ నేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఆయన స్పష్టం చేశారు. ఆదివారం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
మెట్రో రైల్ ప్రాజెక్ట్ స్థలాల బదాలాయింపునకు సంబంధించిన ఫైళ్లన్నిం టినీ అఖిలపక్షం సమావేశంలో పెట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్పీకర్ వద్ద ఉంచినా తమకు సమ్మతమేనన్నారు. మెట్రో భూకేటాయింపులు, బదలాయింపుల వివాదంపై చర్చకు ఐటీ మంత్రి కెటి రామారావు ముందుకు రావాలని సవాల్ విసిరారు. ఐటీఐఆర్లో భాగంగా రూ.350 కోట్లకు గేమింగ్ సిటీ కో సం సుమారు 8 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని కేటాయించడం ద్వారా 15వేల మందికి ఉపాధి లభిస్తుందని అప్పట్లో ఏపీఐఐసీ వీసీఎండీ జయేష్ రంజన్ ప్రకటించారని రేవంత్ గుర్తు చేశారు.
అలాంటి గేమింగ్ సిటీకి కేటాయించిన స్థలాన్ని ఆక్వాస్పేస్ డెవలపర్స్కు ఎందుకు బదలాయించారని ఆయన అడిగారు. ఈ ఏడాది జనవరిలో అప్పటి సీఎం కిరణ్కుమార్రెడ్డి గేమింగ్ సిటీ ప్రారంభోత్సవానికి వెళితే తెరాస ఎమ్మెల్యేలతో కలిసి మైహోం రామేశ్వర్రావు ధర్నా చేసి అడ్డుకున్నారని, అప్పటి ఐటీ మంత్రి పొ న్నా టల లక్ష్మయ్యను బెదిరించారని ఆరోపించారు. గేమింగ్ సిటీ స్థలంపై కన్నేయడం వల్లే వారు ఈ విధంగా చేశారన్నారు. నాటి ధర్నాకు సంబంధించిన సీడీలను రేవంత్ విలేకరులకు అందజేశారు.
ఈ ఏడాది జూన్2న తెరాస అధికారం చేపట్టగానే జూన్ 27న జీవో ఎంఎస్ 6ను జారీ చేసి, స్టాంప్ డ్యూటీని మినహాయించి ఆగస్టులో మైహోంకు భూముల బదలాయింపును పూర్తి చేసినట్లు టీఎస్ ఐఐసీ వీసీఎండీ వెంకట్ నర్సింహారెడ్డి శనివారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో స్పష్టం చేశారని వివరించారు. ఇది అక్రమ బదలాయింపు అని, ఇలాంటి బదలాయింపులు చేస్తే తన ఉద్యోగానికి ఎసరు వస్తుందనే భయంతో జయేష్ రంజన్ దీర్ఘకాలిక సెలవుపై వెళ్లారని తెలిపారు.
సుమారు రూ.700 కోట్లు చెల్లించిన డీఎల్ఎఫ్కు ఏడేళ్లు గడిచినా స్థలాన్ని కేటాయించని ప్రభుత్వం రామేశ్వరరావుకు కేవలం ఏడు నెలలు గడవక ముందే స్థలాన్ని కేటాయించిందంటే, ఎవరికి లబ్ధి చేకూర్చేందుకు ఈ పని చేసిందో ప్రకటించాలని డిమాండ్ చేశారు. ట్రాన్స్కో, గేమింగ్ సిటీ, పోలీస్ శాఖకు కేటాయించిన స్థలాలను మైహోం సిటీకి బదలాయిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ బదలాయింపులతో సుమారు రూ.1000 నుంచి 1500 కోట్లకు పైగా ప్రభుత్వానికి నష్టం జరుగుతుందన్నారు.
భూబదలాయింపులను రద్దు చేయని పక్షంలో శాసనసభలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని స్పష్టం చేశారు. బలప్రయోగంతో దాటవేస్తే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామన్నారు. తాను చేసిన ఆరోపణలపై పరువునష్టం దావా వేస్తామని ఆక్వాస్పేస్ డెవలపర్స్ చేసిన ప్రకటను స్వాగతిస్తున్నట్లు రేవంత్ ప్రకటించారు.