షకీలా సినిమా చూసినట్లు: జగన్ పార్టీపై రేవంత్ రెడ్డి
హైదరాబాద్: వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి వెళ్తే షకీలా సినిమా చూసినట్లు ఉందని ఆ పార్టీవారే అంటున్నారని తెలుగుదేశం తెలంగాణ ప్రాంత నాయకుడు రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెసు ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని ముద్దపప్పుగా, జగన్ను గన్నేరు పప్పుగా ఆయన అభివర్ణించారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి అధ్యక్షతన శనివారం జరిగిన పార్టీ తెలంగాణ ప్రాంత విస్తృత స్థాయి సమావేశంలో ఆయన ప్రసంగించారు.
రాష్ట్రంలోని ఏ నాయకుడు కూడా చంద్రబాబు కాలిగోటికి సరిపోరని ఆయన అన్నారు. కాంగ్రెసు తెలుగుదేశం పార్టీపై కుట్ర చేస్తోందని, కాంగ్రెసు పార్టీని సమాధి చేస్తామని ఆయన అన్నారు. తమకు తెలంగాణ కావాలి, టిడిపి ఉండాలని ఆయన అన్నారు. హైదరాబాద్ను చంద్రబాబు అభివృద్ధి చేశారు కాబట్టే విభజన సమయంలో హైదరాబాద్ చుట్టూ చర్చ జరుగతోందని ఆయన అన్నారు.
హైటెక్ సిటీని చంద్రబాబు నిర్మించారని, ప్రపంచంలో గుర్తింపు వచ్చేలా హైదరాబాదును తొమ్మిదేళ్లలో అభివృద్ధి చేశారని ఆయన అన్నారు. తమ పార్టీ ఉంటే ఆటలు సాగవని దొరలు అనుకుంటున్నారని, అందుకే కుట్రలు చేస్తున్నారని, ఆ కుట్రలను తిప్పికొట్టాలని ఆయన అన్నారు. టిడిపిని అధికారంలోకి తేవడానికి సైనికుల్లా పనిచేయాలని ఆయన సూచించారు.
సబ్బం హరిని, రఘురామరాజులను అడిగితే జగన్ పార్టీ గురించి తెలుస్తుందని ఆయన అన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి, బొత్స సత్యనారాయణ, జగన్ ఎవరైనా చంద్రబాబు కాలిగోటికి సరిపోరని ఆయన అన్నారు. ఆ తర్వాత వరంగల్ జిల్లాకు చెందిన రేవూరి ప్రకాష్ రెడ్డి మాట్లాడారు.