మత్తయ్యకు టిఆర్ఎస్ కార్యకర్తల బెదిరింపులు: సిఐడి వద్ద ఆధారాలు?
హైదరాబాద్: నోటుకు ఓటు కేసులో నాలుగో నిందితుడు జెరూసలెం మత్తయ్య సోదరుడిపై దాడి చేసింది హైదరాబాద్ పోలీసులేనని ఆంధ్రప్రదేశ్ సిఐడి అధికారులు గుర్తించినట్లు చెబుతున్నారు. అయితే న్యాయపరమైన చిక్కులు రాకుండా ముందుకెళ్లాలన్న పోలీసు ఉన్నతాధికారుల సూచనతో సీఐడీ అధికారులు జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారని మీడియాలో వార్తలు వచ్చాయి.
ముడుపుల వ్యవహారం వెలుగులోకి వచ్చాక స్టీఫెన్సన్ ఓటు విక్రయానికి సహకరించినట్లు భావిస్తున్న జెరూసలెం మత్తయ్యను తెలంగాణ ఏసీబీ అధికారులు నాలుగో నిందితుడిగా చేర్చిన సంగతి తెలిసిందే. అయితే కొందరు వ్యక్తులు మత్తయ్య ఇంటికెళ్లి మరీ ఆయన భార్యను దుర్భాషలాడి, అతని సోదరుడు ప్రభుదాస్ను కొట్టారనే ఆరోపణలు వచ్చాయి.
దీనిపై విజయవాడ పోలీసులకు మత్తయ్య ఫిర్యాదు చేశారు. నామినెటెడ్ ఎమ్మెల్యే పదవి ఇచ్చేందుకు స్టీఫెన్సన్ నుంచి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ డబ్బులు తీసుకున్నారని వారు ఆరోపిస్తున్నారు. ఆ విషయాన్ని వెల్లడిస్తానన్న భయంతో తన సోదరుడు, భార్యపై గుర్తు తెలియని వ్యక్తులతో దాడి చేయించారని ఫిర్యాదులో చెప్పారు. తన కుటుంబానికి రక్షణ కల్పించాలని బెజవాడ పోలీసులకు విన్నవించారు.
ఘటన జరిగింది హైదరాబాద్లో కావడంతో ఏపీ ప్రభుత్వం కేసును సీఐడీకి అప్పగించింది. రంగంలోకి దిగిన సీఐడీ అధికారులు మత్తయ్య కుటుంబాన్ని బెదిరించింది హైదరాబాద్ సిటీ పోలీసులని గుర్తించారు. మత్తయ్య, ఆయన భార్య, సోదరుడు ప్రభుదాస్ నెంబర్లకు మే చివరి వారం నుంచి జూన్ మొదటి వారం వరకు వచ్చిన కాల్స్ డేటాను సీఐడీ అధికారులు సేకరించారు.
అందులో కొన్ని నంబర్లు టీఆర్ఎస్ కార్యకర్తల పేరుతో ఉన్నట్లు సమాచారం. దీంతో వారిని అదుపులోకి తీసుకొనేందుకు ఏపీ సీఐడీ సమాయత్తమవుతున్నట్లు తెలిసిందంటూ వార్తలు వచ్చాయి.