అమరావతి రైతుల రివర్స్ ఎటాక్ .. పాలకులే పెయిడ్ ఆర్టిస్టులు అంటూ
రాజధాని అమరావతి రైతులు ఇప్పుడు ఏపీలోని వైసీపీ సర్కార్ మీద రివర్స్ ఎటాక్ చేస్తున్నారు. పదేపదే అమరావతిలో ఆందోళనలు చేస్తున్న రైతులు పెయిడ్ ఆర్టిస్టులు అంటూ వైసీపీ నేతల విమర్శల నేపధ్యంలో వారు మా దగ్గరకు వచ్చి మమ్మల్ని ఓట్లు అడిగి ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చిన పాలకులే పెయిడ్ ఆర్టిస్టులు అంటూ పాలకుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రాజధాని ప్రాంతంలో కొనసాగుతున్న ఆందోళనలు
ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలోని రాజధాని గ్రామాల్లో రైతుల రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. రోడ్లు పక్కన టెంట్లు వేసిన రైతులు నేటికీ దీక్షలను కొనసాగిస్తున్నారు. సీఎం జగన్ మూడు రాజధానుల ప్రతిపాదన ..జీఎన్ రావు కమిటీ దానికి అనుకూలంగా నివేదిక ఇవ్వటం వంటి పరిణామాలతో అమరావతి ప్రాంతంలోని 29 గ్రామాల రైతులు రోడ్డెక్కారు. మూడు రాజధానులు వద్దు..అమరావతి ముద్దు , అమరావతిని తరలించవద్దు అంటూ తమ డిమాండ్ వినిపిస్తున్నారు .
పెయిడ్ ఆర్టిస్టులు అని వైసీపీ నేతల వ్యాఖ్యలపై ఆగ్రహం
రాజధానికి భూములిచ్చి ఇప్పుడు ఎటూ కాని పరిస్థితుల్లో ఆందోళన చేస్తే తమను పట్టుకుని పెయిడ్ ఆర్టిస్టులు అని చేస్తున్న వ్యాఖ్యలపై రాజధాని ప్రాంత రైతులు నిప్పులు చెరుగుతున్నారు. అమరావతి ప్రాంత రైతులు సీఎం జగన్, మంత్రులు..ఎమ్మెల్యేలపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. అమరావతి తరలించవద్దని ఇప్పుడు రోడ్లపాలైన తాము నిరసనలు చేస్తుంటే తమను పట్టుకుని పెయిడ్ ఆర్టిస్టులు..జూనియర్ ఆర్టిస్టులు అంటారా?అంటూ వారు మండిపడుతున్నారు. ఇదేనా రాష్ట్రాన్ని పాలించే పాలకుల విజ్ఞత అంటూ ఆందోళనలు కొనసాగిస్తున్నారు.
నోటికి వచ్చింది మాట్లాడితే ఊరుకోం అంటున్న రాజధాని రైతులు
ఇక తమకు అన్యాయం చెయ్యవద్దని డిమాండ్ చేస్తున్న రాజధాని రైతులు వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై రివర్స్ దాడి చేస్తున్నారు. అసెంబ్లీ స్పీకర్ స్థానంలో ఉన్న తమ్మినేని సీతారాం రాజధాని రాజస్థాన్ ఎడారి అని రాజకీయాలు ఎలా మాట్లాడుతారు? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్మశానం , అని ఎడారి అని ఇష్టారాజ్యంగా మాట్లాడే నేతలకు రాజధాని రైతులు బుద్ధి చెప్తారని హెచ్చరిస్తున్నారు.
పెయిడ్ ఆర్టిస్టులు మీరే అని మండిపడుతున్న రైతులు
రాజధాని కోసం రైతులు చేస్తున్న ఉద్యమాన్ని చులకన చేసి మాట్లాడితే సహించేది లేదని వారంటున్నారు . నేతలు నోరు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని లేదంటే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని రైతులు హెచ్చరించారు. రాజధాని రైతుల డిమాండ్ భూములు కావాలని కాదని, అమరావతిని తరలించవద్దు అని మాత్రమే అని రైతులు పేర్కొన్నారు.ఇక తమ పోరాటాన్ని తప్పుగా మాట్లాడే వైసీపీ నేతలే పెయిడ్ ఆర్టిస్టులు అని వారు ఎదురు దాడికి దిగుతున్నారు.