కొత్తగూడెం రసవత్తరం: బాలయ్య సన్నిహితుడితో వారి ఢీ
ఖమ్మం: ఖమ్మం జిల్లా కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గంలో చతుర్ముఖ పోటీ నెలకొంది. కాంగ్రెస్ మద్దతుతో సిపిఐ సిటింగ్ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివ రావు మరోసారి బరిలోకి దిగుతున్నారు. గతంలో కాంగ్రెస్ టికెట్పై పోటీచేసి ఓడిపోయిన వనమా వెంకటేశ్వర రావు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తరఫున, బిజెపి మద్దతుతో టిడిపి అభ్యర్థిగా కోనేరు సత్యనారాయణ తలపడుతున్నారు. మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు తనయుడు జలగం వెంకట్రావు తెరాస నుండి పోటీ చేస్తున్నారు.
జగన్ పార్టీ టికెట్ ఆశించి చివరిక్షణంలో భంగపడ్డ యడవల్లి కృష్ణ స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల గోదాలో దూకి ప్రధాన అభ్యర్థులకు దీటుగా పోరాడుతున్నారు. గత ఎన్నికల్లో టిడిపి, తెరాస, సిపిఎం మద్దతుతో మహా కూటమని తరఫున సిపిఐ అభ్యర్థిగా కూనంనేని సాంబశివ రావు బరిలోకి దిగి కాంగ్రెస్ అభ్యర్థి వనమా వెంకటేశ్వర రావుపై విజయం సాధించారు. మారిన రాజకీయ సమీకరణాల దృష్ట్యా ఆయన ఈసారి కాంగ్రెస్ బలంతో విజయం కోసం పోరాడుతున్నారు.
2009లో విజయం సాధించిన కూనంనేనికి ఉద్యోగులు, కార్మికులతో మంచి సంబంధాలున్నాయి. గెలిచిన తర్వాత ఆయన పార్టీకి జవసత్వాలు నింపారు. కేడర్ను, మద్దతుదారులను పెంచుకోగలిగారు. తెలంగాణపై గట్టిగా పోరాడిన ఆయన తాను రూ.800 కోట్ల నిధులు తెచ్చి అభివృద్ధి చేశానని చెబుతున్నారు. నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులే తనను గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మం ఎంపీ అభ్యర్థిగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ పోటీలో ఉండడం కూనంనేనికి కలిసివచ్చే అంశం.
కాంగ్రెస్పార్టీ కేడర్ అందించే సహకారంపైనే కూనంనేని గెలుపు ఆధారపడి ఉందంటున్నారు. టిడిపి అభ్యర్ధిగా పోటీ చేస్తున్న కోనేరు సత్యనారాయణ పది సంవత్సరాలుగా పార్టీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గతంలో కౌన్సిలర్గా గెలిచిన ఆయన కొత్తగూడెం మున్సిపల్ వైస్ చైర్మన్గా కొనసాగారు. గతంలో టికెట్ ఆశించినా పొత్తు కారణంగా ఆ అవకాశం రాలేదు. బాలకృష్ణకు అత్యంత సన్నిహితుడిగా ఉండే కోనేరు సత్యనారాయణ ఈసారి ఆయన ఆశీస్సులతోనే టికెట్ సంపాదించారు.
సత్యనారాయణ తండ్రి కోనేరు నాగేశ్వర రావు... 1983, 1985, 1999ల్లో కొత్తగూడెంనుంచి విజయం సాధించారు. ఎన్టీఆర్ కేబినెట్లోమంత్రిగా కూడా పని చేశారు. కొత్తగూడెంను సీపీఐకి కేటాయించడంతో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన డిసిసి అధ్యక్షుడు వనమా వెంకటేశ్వర రావు జగన్ పార్టీలో చేరి టిక్కెట్ దక్కించుకున్నారు. గతంలో ఈ నియోజకవర్గంనుంచి మూడుసార్లు గెలుపొంది మంత్రిపదవి కూడా దక్కించుకున్న వనమా ఈసారి సానుభూతిపైనే ఆశలు పెట్టుకున్నారు.
పొత్తులో తనకు టిక్కెట్ రాకపోవడంతో కాంగ్రెస్పై తిరుగుబాటు చేశారు. కాంగ్రెస్ పార్టీలో తనకు జరిగిన అన్యాయాన్ని ప్రజలు గుర్తించి తనను గెలిపిస్తారని ఆయన ధీమాగా ఉన్నారు. ప్రజలతో సత్సంబంధాలు కల్గి ఉండడం, బిసి అభ్యర్థిగా గుర్తింపు ఉండడం ఆయనకు కలిసి వచ్చే అంశాలు. చివరి వరకు జగన్ పార్టీ టికెట్ ఆశించి భంగపడ్డ వనమా తోడల్లుడు యడవల్లి కృష్ణ స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉండడం ఆయనకు ప్రతికూలాంశం.
జిల్లాలో తెరాసకు బలం లేదు. ఎలాగైనా కొత్తగూడెంలో పాగా వేయాలని భావిస్తున్నారు. గతంలో సత్తుపల్లినుంచి ఎమ్మెల్యేగా గెలిచిన వెంకట్రావు 2009లో కాంగ్రెస్ తిరుగుబాటు అభ్యర్థిగా ఖమ్మంలో ఓడారు. తర్వాత జగన్ పార్టీలో చేరినా క్రియాశీల రాజకీయాల్లో పెద్దగా పాల్గొనలేదు. ఈసారి ఎన్నికల ముందు తెరాసలో చేరి కొత్తగూడెం సీటు దక్కించుకున్నారు. తండ్రి జలగం వెంగళరావు సిఎంగా చేపట్టిన అభివృద్ధి పనులు, సింగరేణి కార్మిక సంస్థ తెరాస చేతిలో ఉండటం, తెలంగాణ సెంటిమెంటు సానుకూల అంశాలు. మరోవైపు స్వత్రంత్ర అభ్యర్థి యడవల్లి కృష్ణ ప్రధాన పార్టీ అభ్యర్థులకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు.