అమిత్ షా ఆదేశాలు: బిజెపి, టిడిపి మధ్య చిచ్చు రగులుతోందా?
హైదరాబాద్: మిత్ర పక్షాలైన బిజెపి, తెలుగుదేశం పార్టీల మధ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిచ్చు రగులుతున్నట్లు కనిపిస్తోంది. అంతగా ఆ విభేదాలు బయటపడకపోయినప్పటికీ ఇరు పార్టీలు కూడా రగిలిపోతున్నట్లు చెబుతున్నారు. టిడిపితో కలిసి నడుస్తున్న బిజెపి సొంత బలాన్ని పెంచుకుని వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసే దిశగా అడుగులు వేస్తున్నట్లు చెబుతున్నారు.
విశాఖపట్నంలో ఆదివారం జరిగిన పార్టీ కార్యవర్గ సమావేశంలో ఆ విషయంపై బిజెపి నాయకులు చర్చించినట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీకి చిన్నపాటి భాగస్వామిగా ఎంత మాత్రం ఉండకూడదని, సొంత బలాన్ని పెంచుకోవాలని బిజెపి నాయకులు అభిప్రాయపడినట్లు చెబుతున్నారు.
వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయడానికి అవసరమైన బలాన్ని కూడగట్టుకోవాలని బిజెపి జాతీయాధ్యక్షుడు అమిత్ షా రాష్ట్ర నాయకులకు ఆదేశాలు జారీ చేసినట్లు, దాంతో రాష్ట్ర నాయకులు అందుకు అవసరమైన కసరత్తు ప్రారంభించినట్లు చెబుతున్నారు.
భవిష్యత్తు ఎలా ఉంటుందో చెప్పలేమని, రాజకీయ పరిణామాలు ఎటైనా దారి తీయవచ్చునని, అందువల్ల సొంత బలాన్ని కూడగట్టుకోవాలని తాము భావిస్తున్నట్లు బిజెపి రాష్ట్ర నాయకులు చెబుతున్నారు. దానికితోడు, ఎపికి కేంద్ర సాయం విషయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వంపై నేరుగానే నిందులు వేశారు. దాంతో తమను చంద్రబాబు ప్రత్యర్థులుగానే భావిస్తున్నారనే అభిప్రాయం బిజెపి నాయకుల్లో ఉంది.
కేంద్రం రాష్ట్రానికి తగిన సాయం అందించడం లేదని అంటూ ప్రత్యేక హోదాను రాజకీయం చేసేందుకు టిడిపి సిద్ధపడిందని అంటున్నారు. ప్రత్యేక హోదా విషయాన్ని పక్కన పెడితే కేంద్రం ఇప్పటికే గత పది నెలల కాలంలో 8 వేల కోట్లు మంజూరు చేసిందని బిజెపి నాయకులు అంటున్నారు. ఐఐటి, ఐఐఎం, ఎయిమ్స్ వంటి సంస్థల విషయంలో కేంద్రం చాలా వేగంగా సాయం అందించడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం జాప్యం చేస్తోందని చెబుతున్నారు.
రాయలసీమలోని రైతుల సమస్యలను, కరువును రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కూడా బిజెపి నాయకులు విమర్శిస్తున్ారు. రాయలసీమ జిల్లాలకు కేంద్రం 350 కోట్ల రూపాయలు ఇచ్చినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం వాటిని ఖర్చు చేయడం లేదని విమర్శిస్తున్నారు.
బిజెపి వైఖరిని గమనించిన తెలుగుదేశం పార్టీ తాను కూడా వెనక్కి తగ్గడానికి సిద్ధంగా ఉండకూడదని భావిస్తోంది. కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన 8 వేల కోట్లు 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు వచ్చిందే తప్ప అదనంగా వచ్చిందేమీ కాదని తెలుగుదేశం పార్టీ నాయకులు అంటున్నారు. పోలవరం ప్రాజెక్టుకు కేవలం వేయి కోట్ల రూపాయలు కేటాయించి చేతులు దులుపుకుందని, దానికి 16 వేల కోట్లు కేటాయిస్తే తప్ప పని జరగదని టిడిపి నాయకులు అంటున్నారు. రాజధాని నిర్మాణానికి 20 వేల కోట్లు కావాల్సి ఉండగా, కేవలం 1,500 కోట్లు మాత్రమే కేంద్రం ఇచ్చిందని అంటున్నారు.
ఈ స్థితిలో బిజెపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తనపై నిందలు పడకుండా చర్యలు తీసుకునే పనిలో పడినట్లు తెలుస్తోంది. అవసరమైతే వచ్చే ఎన్నికల నాటికి టిడిపితో తెగదెంపులు చేసుకుని సొంతంగా రంగంలోకి దిగే అలోచన కూడా చేస్తోందని అంటున్నారు.