స్టీల్ ప్లాంట్ ఉద్యోగులపై అనూహ్య నిర్ణయం-తెర వెనుక, కూటమికి ఇరకాటం..!!
విశాఖ స్టీల్ ప్లాంట్ లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కేంద్రం స్టీల్ ప్లాంట్ కోసం ప్రత్యేకంగా భారీ ప్యాకేజీ ప్రకటించింది. ఇక, ప్రయివేటీకరణకు అవకాశం లేదని కూటమి నేతలు పదే పదే చెబుతున్నారు. ఉత్పత్తి పెంపు పైన ఉద్యోగులు శ్రద్ద పెట్టాలని సూచిస్తున్నారు. ఈ సమయంలోనే ప్లాంట్ లో మాత్రం తొలి నుంచి సిద్దం చేసిన ప్రణాళికలే అమలు చేస్తున్నారు. ఉద్యోగుల తగ్గింపు దిశగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పుడు పెద్ద సంఖ్యలో ఉద్యోగులను బలవంతపు రిటైర్మెంట్ ద్వారా బయటకు పంపే నిర్ణయాలు అమలుకు రంగం సిద్దమైంది.
ఉద్యోగులకు సీఆర్ఎస్
విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఏం జరుగుతోంది. కేంద్రం - రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని హామీలు ఇస్తున్నా.. తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలు మాత్రం ప్రయివేటీకరణ అనుమానాలను మరింతగా పెంచుతున్నాయి. కొంత కాలంగా ఉద్యోగుల భారం తగ్గించుకోవటం కోసం స్టీల్ ప్లాంట్ యాజ మాన్యం తొలుత వీఆర్ఎస్ పథకం అమలు చేసింది. ఇప్పుడు తాజాగా 'తప్పనిసరి పదవీ విరమణ పథకం (సీఆర్ఎస్)' అమలుకు రంగం సిద్ధం చేయటం కలకలం రేపుతోంది. ప్లాంట్ లో దాదాపు 15 ఏళ్ల నుంచి పనిచేస్తున్న 1200 మందికి ఇటీవల వీఆర్ఎస్ ఇచ్చారు. అయినా, ఉద్యోగుల సంఖ్య ఇంకా తగ్గించాలని ఉక్కు మంత్రిత్వ శాఖ ఆదేశించడంతో ఇప్పుడు సీఆర్ఎస్ అమలు దిశగా కసరత్తు జరుగుతోంది. తొలుత దీనిని ఎగ్జిక్యూటివ్ ఉద్యోగులతో ప్రారంభిస్తున్నారు. ఆ తరువాత నాన్ ఎగ్జిక్యూటివ్లకు వర్తింపజేయనున్నట్లు చెబుతున్నారు.

ఉద్యోగులను తప్పించేలా
తాజా ఆలోచనల్లో భాగంగా రెండేళ్ల సర్వీసు ఉన్న వారిని దీనికి ఎంపిక చేసుకున్నారు. గతంలో ఏ కారణాల వల్లనైనా రెండు షోకాజ్ నోటీసులు అందుకొని ఉంటే...వాటికి ఇప్పుడు సంజాయిషీ కోరుతున్నారు. ఆయా కారణాల వల్ల ఎందుకు సీఆర్ఎస్ విధానంలో మిమ్మల్ని తొలగించకూడదో చెప్పాలని కోరుతూ నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. యాజ మాన్యం తమ చర్యలను ప్రశ్నించేవారు ఎవరైనా ఉంటే వారిని ఏదో విధంగా బయటకు పంపాలని ఇలాంటి ఎత్తుగడలు వేస్తోందని ఉద్యోగ సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. తాజాగా సుమారు 100 మందికి సీఆర్ఎస్ ఇవ్వాలని ప్రణాళిక సిద్ధం చేసినట్లు ఉద్యోగ సంఘాల నేతల అంచనగా వెల్ల డించారు. ఈ విధంగా వెళ్లిపోయే వారికి కేవలం మూడు నెలల జీతం మాత్రమే ఇవ్వనున్నారు. కాగా, వారికి ఎటువంటి నష్ట పరిహారాలు రావు. గ్రాట్యుటీ, పీఎఫ్ వంటివి అందరితో పాటు వస్తాయి.
కూటమి కి ఇరకాటం
ఇదే సమయంలో ప్లాంటులో రెండో విడత వీఆర్ఎస్ ప్రకటన ఇవ్వడానికి కూడా ఏర్పాట్లు జరుగు తున్నాయి. మొదటి విడతలో చాలామంది ఆసక్తి చూపకపోవడంతో యాజమాన్యం లక్ష్యం నెరవేరి నట్లు కనిపించటం లేదు. దీంతో, లక్ష్యం పూర్తి చేసే క్రమంలో రెండో విడత వీఆర్ఎస్ కు ముందు సీఆర్ఎస్ నోటీసులతో ఉద్యోగులను భయపెడుతున్నట్లు కార్మిక సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మూడు నెలల జీతంతో షోకాజ్లు అందుకొని వెళ్లడం కంటే గౌరవంగా వీఆర్ఎస్ సతో అన్ని రకాల ప్రయోజనాలు తీసుకోవడమే మంచిదనే నిర్ణయానికి ఉద్యోగులు వచ్చేలా ఒత్తిడి తీసుకువస్తున్నారు. ఇప్పుడు ఉద్యోగుల విషయంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు రాష్ట్రం లో అధికారంలో ఉన్న కూటమి నేతల పైన ప్రభావం పడుతున్నాయి. దీంతో, అసలు ప్లాంట్ విషయంలో కేంద్రం వైఖరి ఏంటనేది అంతు చిక్కని అంశంగా మారుతోంది.












Click it and Unblock the Notifications