రిషికేశ్వరి మృతి: బాబురావు అరెస్ట్కు డిమాండ్, ఫేస్బుక్ పేజీలో ప్రచారం
గుంటూరు: నాగార్జున విశ్వవిద్యాలయంలో ఆర్కిటెక్చర్ విద్యార్థిని రిషికేశ్వరి ఆత్మహత్య కేసులో ప్రిన్సిపల్ బాబురావును వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు శనివారం నాడు ఆందోళన చేపట్టారు.
రిషికేశ్వరి ఫేస్బుక్ పేజీలో విద్యార్థులు విస్తృతంగా ప్రచారం చేశారు. మన చెల్లెలు మనలను విడిచి నెల రోజులు గడిచినా నిష్పక్షపాతంగా విచారణ జరగడంలేదని వారు ఆందోళన వ్యక్తం చేశారు.
ఆడపిల్లలకు రక్షణ కల్పించలేని స్వాతంత్ర్యం ఎందుకని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మరో మహాత్మా గాంధీ కోసం మనం ఎదురు చూద్దామంటూ కామెంట్లు పోస్ట్ చేశారు.

మరోవైపు, మహిళల పైన జరుగుతున్న అన్ని రకాల దాడులు అరికట్టగలిగినప్పుడే దేశానికి నిజమైన స్వాతంత్రం అని మహిళా సమాఖ్య నాయకులు పేర్కొన్నారు.
మహిళలపై దాడులను అరికట్టాలని ఏపీ మహిళా సమాఖ్య డిమాండ్ చేసింది. విజయవాడ నగర శాఖ ఆధ్వర్యంలో గాంధీ విగ్రహం ముందు నిరసన తెలిపారు. మహిళల పైన దాడులు ఎప్పటికప్పుడు అధికమవుతున్నాయన్నారు.
ఇంత జరుగుతున్నా ప్రభుత్వాలు స్పందించడం లేదన్నారు. చట్టాలు పని చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సమాజంలో మహిళలు నిర్భయంగా తిరిగేందుకు అనువైన భద్రత కల్పించడంలోప్రభుత్వాలు, వ్యవస్థలు విఫలమవుతున్నాయన్నారు.
ర్యాగింగ్, ఈవ్ టీజింగ్ పేరిట విద్యార్థినుల ప్రాణాలు బలిగొంటున్నారన్నారు. వరకట్నం వేధింపులతో మహిళల ప్రాణాలు తీస్తున్నారని, ప్రేమ పేరుతో యాసిడ్ దాడులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications