ముప్పేట దాడి: వైయస్ జగన్ వ్యూహం ఏమిటి?
హైదరాబాద్: ఎన్నికల వేళ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై ప్రత్యర్థులు అన్ని వైపుల నుంచి అస్త్రాలు సంధిస్తున్నారు. అమెరికాలో వెలుగు చూసిన టైటానియం కుంభకోణం కేసులో కూడా వైయస్ జగన్మోహన్ రెడ్డిపై ఆరోపణలు సంధిస్తూ మీడియాలో వార్తలు పెద్ద యెత్తున వచ్చాయి. టైటానియం కుంభకోణంలో పేరు చెప్పకుండా మిస్టర్ సిగా ఎఫ్బిఐ పేర్కొన్న వ్యక్తి వైయస్ జగన్ అయి ఉంటాడని మీడియాలో వార్తాకథనాలు వచ్చాయి.
ఆ నేపథ్యంలో అతను వైయస్ జగన్మోహన్ రెడ్డే అయి ఉంటాడని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీలో ఇటీవలే చేరిన జెసి దివాకర్ రెడ్డి అన్నారు. అదే సమయంలో జనసేన అధినేత, సినీ హీరో పవన్ కళ్యాణ్ కూడా వైయస్ జగన్మోహన్ రెడ్డినే లక్ష్యం చేసుకున్నట్లు కనిపిస్తున్నారు. సీమాంధ్రలో తెలుగుదేశం పార్టీకి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి మధ్య హోరాహోరీ పోరు జరుగుతుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో తన ప్రాబల్యం తగ్గించడానికే ఆ విధమైన దాడులకు పాల్పడుతున్నారని జగన్ భావిస్తున్నట్లు సమాచారం.
అయితే, ప్రత్యర్థుల దాడులను ఎదుర్కోవడానికి వైయస్ జగన్ ఏం చేస్తారనే విషయం తెలియడం లేదు. ఈనాడు రామోజీరావుపై దుమ్మెత్తి పోస్తూ సాక్షి దినపత్రికలో శనివారం ఓ వార్తాకథనం ప్రచురితమైంది. పవన్ కళ్యాణ్పై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ తీవ్రంగా ధ్వజమెత్తారు. అంతకు మించి పార్టీ నుంచి పెద్దగా ప్రతిస్పందనలు లేవు.
టైటానియం కుంభకోణం విషయంలో ప్రత్యర్థుల దాడిని తిప్పికొట్టేందుకు జగన్ పార్టీ నాయకులకు సరైన సూచనలు చేయడం లేదని, ఆ విషయంపై ఆయన ఏమీ మాట్లాడడం లేదని అంటున్నారు. ఈ విషయంపై వచ్చిన వార్తలను తిప్పికొడుతూ ఓ సందర్భంలో జగన్ తల్లి వైయస్ విజయమ్మ చేత మీడియా సమావేశం ఏర్పాటు చేయించాలని పార్టీ నాయకులు అనుకున్నట్లు సమాచారం. కానీ అది ముందు పడలేదని అంటున్నారు.
టైటానియం కుంభకోణంపై పార్టీ నాయకులు మాట్లాడుతూ పోతే అసలు విషయం దారి తప్పుతుందని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా, టైటానియం వ్యవహారాన్ని మొత్తం కాంగ్రెసు రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచందర్ రావుపైకి నెట్టేయాలనే ప్రయత్నాలు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నుంచి జరిగాయని అంటున్నారు. తానే ప్రజల ముందు ప్రత్యర్థులను ఎండగట్టాలనే ఉద్దేశంతో ఆయన ఉన్నట్లు చెబుతున్నారు.