ఎగిరెగిరి తన్నారు! పంగనామాలు: బాబును ఏకిపారేసిన రోజా
హైదరాబాద్: ఈ సంవత్సరం ముగుస్తున్న నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి పరిపాలనపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు పాలనలో ఈ ఏడాది మొత్తం అరాచకాలు, అత్యాచారాలు, ఆత్మహత్యలు, అబద్ధాలతో సాగుతోందని ధ్వజమెత్తారు.
Recommended Video
2017 నారావారి నరకాసురనామ సంవత్సరంగా ఉందని రోజా ఎద్దేవా చేశారు. సీఎం చంద్రబాబు ధైర్యంగా తన మేనిఫెస్టోను చూడగలరా? అని నిలదీశారు. చంద్రబాబు పాలనలో మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. వెన్నుపోటు పొడవడంలో చంద్రబాబుకు మించినవారులేరన్నారు.
పంగనామాలు పెట్టారు..
శనివారం రోజా మీడియాతో మాట్లాడుతూ.. ‘డ్వాక్రా మహిళల రుణాలు ఎత్తివేసేందుకు వారికి రూ.14,204కోట్లు ఇస్తే సరిపోతుంది. ఈ డబ్బు చంద్రబాబు, టీడీపీ నేతలు దోచుకున్న దానితో పోలిస్తే 1శాతం. కానీ, అధికారంలోకి వచ్చిన బాబు మాత్రం మహిళలకు పంగనామాలు పెట్టారు. ఇప్పుడు చంద్రబాబు ఎప్పుడు తమ గ్రామాల్లోకి అడుగుపెడతారా? ఎప్పుడు నిలదీద్దామా? అని మహిళలు ఎదురుచూస్తున్నారు' అని రోజా అన్నారు.
అన్నీ అబద్ధాల హామీలే..
‘పుట్టిన ప్రతి బిడ్డ పేరిట రూ.30 వేలు వేస్తానని అన్నారు.. ఇప్పటి వరకు ఏపీలో ఆడపిల్లలే పుట్టలేదా? పౌష్టికాహారం కోసం గర్భిణీలకు రూ.10 వేలు ఇస్తానని వారిని మోసం చేశారు. పేద మహిళలకు స్మార్ట్ ఫోన్లు ఇస్తానని అన్నారు. అన్యాయం జరిగిన ఐదు నిమిషాల్లో వారి ముందు వాలతానని చెప్పి మోసం చేశారు. న్యాయం చేయకపోగా అన్యాయానికి గురైన మహిళలు ఫిర్యాదు చేసేందుకు స్టేషన్కు వెళితే వారిని భయపెట్టి వెనక్కు పంపుతున్నారు. ఇప్పటి వరకు రిషితేశ్వరి కేసు ఎటూ తేలలేదు' అంటే చంద్రబాబు పాలనపై రోజా తీవ్ర ఆరోపణలు చేశారు.
ఎగిరెగిరి తన్నారు.. అయినా..
‘అనంతపురం జిల్లాలో సుదమ్మ అనే మహిళను కొంచెం పక్కకు జరిపి కట్టమన్నందుకు పయ్యావుల అనుచరులు.. మహిళ అని కూడాచూడకుండా ఎగిరెగిరి ఆమెను తన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే మహిళలపై ఏపీలో జరిగిన దాడులు ఎన్నో ఉన్నాయి. పోలీసులు నేరస్తుల కోసం పనిచేస్తున్నారేమో అనిపిస్తోంది. ఆఖరికి టీడీపీ ఎంపీ శివప్రసాద్ కూతురుకి కూడా అన్యాయం జరిగిందంటే.. టీడీపీ పాలనలో ఇంతకంటే దౌర్బాగ్యం మరొకటి ఉండదు. టీడీపీలో రౌడీలు, గుండాలే రాజ్యమేలుతున్నారు. ఆడపిల్ల అంటే చంద్రబాబుకు గౌరవం లేదు, పట్టించుకోరు. జెర్రిపోతుల పాలెం ఘటనపై చంద్రబాబు కనీసం ఒక్క ప్రకటన చేయలేదు' అని రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు.
అర్ధరాత్రి వరకూ బార్లు బార్లానా?
‘నాలుగు బడ్జెట్లు మారుతున్నాయిగానీ ఆడవాళ్ల తలరాతలు మారలేదు. రెండో సంతకం మద్యం షాపుల నిషేధానికి సంబంధించిన దస్త్రంపైనే పెడతానని అన్నారు. ఇప్పుడేమో మద్యపు ఏరుల్ని పారిస్తూ.. ఖజానా నింపుకోవడానికి డిసెంబర్ 31న రాత్రి 1గంట వరకు వైన్ షాపులు నడుపుకునేందుకు లైసెన్స్లు ఇచ్చారు. ఆడవాళ్ల జీవితాలు చెడిపోయినా పర్వాలేదన్నట్లుగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారు. ఆంగ్ల సంవత్సరం మనకొద్దని, ప్రత్యేక జీవో ఇచ్చిన చంద్రబాబు.. గుళ్లు అలంకరణ చేయొద్దని వైన్స్లు మాత్రం కళకళలాడేట్లు చేశారు' అంటూ రోజా ఎద్దేవా చేశారు.