చంద్రబాబుకు సుప్రీం నోటీసులు లోకేష్ ఎఫెక్టే: ఇక మొదలైందంటూ రోజా సంచలనం
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ అభ్యర్థి నారా లోకేష్పై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు.
విజయవాడ: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ అభ్యర్థి నారా లోకేష్పై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీగా లోకేష్ నామినేషన్ వేయడంతోనే తెలుగుదేశానికి గడ్డు రోజులు ప్రారంభమయ్యాయని ఎమ్మెల్యే రోజా జోస్యం చెప్పారు.
ఈ విషయాన్ని ఒక జ్యోతిష్యుడు చెప్పారని తెలిపారు. వెలగపూడి అసెంబ్లీ ఆవరణలో ఆమె మీడియాతో సోమవారం మాట్లాడుతూ.. ఇందుకు నిదర్శనమే లోకేష్ నామినేషన్ వేసిన కొద్ది సేపటికే సుప్రీంకోర్టు నుంచి సీఎం చంద్రబాబుకు నోటీసులు జారీ అయ్యాయని తెలిపారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు లోపించాయన్నారు.
అంతేగాక, ఇటీవల కాలంలో రాష్ట్రంలో 70 రేప్ కేసులు నమోదు అయ్యాయని తెలిపారు. చంద్రబాబు నాయుడును ఏపి శశికళగా, ఏపీ ట్రంప్గా చెప్పవచ్చన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతుండటంతో చిన్న చిన్న కారణాలతో కొంతమంది కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపించారు. కాగా, సోమవారం టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నారా లోకేష్ నామినేషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.