ఆరుమందిని పొట్టన పెట్టుకున్న అతివేగం: కాలువలోకి పల్టీ కొట్టిన తుఫాన్
గుంటూరు: గుంటూరు జిల్లాలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఆరుమంది దుర్మరణం పాలయ్యారు. వారిలో ఇద్దరు పురుషులు, నలుగురు మహిళలు ఉన్నారు. వారంతా ఒకే గ్రామానికి చెందిన వారు. దగ్గరి బందువులు. ఒక శుభకార్యానికి హాజరైన అనంతరం స్వగ్రామానికి తిరుగు ప్రయాణమైన సమయంలో ఆ ప్రమాదం సంభవించింది. వారు ప్రయాణిస్తున్న వాహనం కాలువలోకి పల్టీ కొట్టింది. జిల్లాలోని వట్టిచెరుకూరు మండలం పుల్లడిగుంట సమీపంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.
కాకుమాను గ్రామానికి చెందిన రెండు కుటుంబాల వారు తమ సమీప బంధువుల ఇంట్లో ఓ శుభ కార్యక్రమంలో పాల్గొనడానికి ఏటుకూరుకు వెళ్లారు. కార్యక్రమాలను ముగించుకున్న అనంతరం వారంతా తుఫాన్ వాహనంలో స్వగ్రామానికి బయలుదేరారు. మార్గమధ్యలో వట్టి చెరుకూరు మండలం పుల్లడిగుంట సమీపానికి చేరుకున్న తరువాత వారు ప్రయాణిస్తోన్న వాహనం ప్రమాదానికి గురైంది. అతి వేగం వల్ల రోడ్డు మలుపులో నియంత్రణ కోల్పోయింది. నేరుగా కాలువలోకి పల్టీ కొట్టింది.

ఈ ఘటనలో శ్రీనివాసులు, సీత, పీ వీరలక్ష్మి, రమణయ్య, వన్నూరు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మరొకరిని గుర్తించాల్సి ఉంది. ఈ సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. గాయపడ్డ వారిని గుంటూరు జనరల్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు అతివేగమే ప్రధాన కారణమని పోలీసులు నిర్ధారించారు. అతివేగం వల్ల రోడ్డు మలుపులో వాహనం నియంత్రణ కోల్పోయిందని ప్రాథమికంగా నిర్ధారించారు.













Click it and Unblock the Notifications