మాజీ ఎమ్మెల్యేపై గిరి పుత్రుల ఆగ్రహం - ఎన్నికల వేళ కొత్త పంచాయితీ..!!
ఎన్నికల వేళ రాజకీయం కొత్త టర్న్ తీసుకుంటోంది. ఎమ్మెల్యేకు ఇమేజ్ వస్తుందనే కారణంతో అభివృద్ధికి అడ్డుపుతున్న ఒక మాజీ ఎమ్మెల్యే వ్యవహారం ఇప్పుడు వివాదాస్పదంగా మారుతోంది. పార్వతీ మన్యం జిల్లాలోని కురుపాం నియోజకవర్గంలో కొంత కాలంగా చోటు చేసుకుంటున్న పరిణామాలపై స్థానికులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. నిధులు మంజూరు చేయించి అభివృద్ధి పనులు ప్రారంభిస్తుంటే, ఏకంగా ఆ మాజీ ఎమ్మెల్యే బెదిరింపులకు దిగి పనులను అడ్డుకోవటం వివాదస్పదంగా మారుతోంది.
అభివృద్ధికి అడ్డుగా: కురుపాం నియోజకవర్గ పరిధిలో అర్నాడ పంచాయితీకి దశాబ్డాల కాలంగా రోడ్లు లేవు. అక్కడ రోడ్డు వేయాలని స్థానికులు ఎప్పటి నుంచో పాలకులను అభ్యర్దిస్తున్నారు. గత పాలకులు ఈ అంశాన్ని నిర్లక్ష్యం చేస్తూ వచ్చారు.అదే గ్రామం నుంచి ఎమ్మెల్యేగా గెలిచినా అక్కడ మాత్రం అభివృద్ధికి నోచుకోలేదు. తాజాగా జాతీయ ఉపాధి హామీ పథకం కింద రూ 70 లక్షలతో బీటీ రోడ్డుకు ఆమోదం లభించింది. కిలో మీటరు మేర ఈ రోడ్డు శాంక్షన్ అయింది. తమ గ్రామానికి మంచి రోడ్డు కావాలనేది అక్కడి గ్రామస్థుల చిరకాల కల. ఇప్పుడు ఆ కల నెరవేరే సమయం వచ్చింది.

మాజీ ఎమ్మెల్యేపై ఆగ్రహం: కానీ, అన్ని అనుమతులు వచ్చి రోడ్డు ప్రారంభం వేళ మాజీ ఎమ్మెల్యే అడ్డంకులు సృష్టిస్తున్నారు.ఉపాధి హామీ పథకం కింద రోడ్డు మంజూరు అయినా..అక్కడ సర్పంచ్ తో పాటుగా వెండార్లు అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. ఇందుకు సర్పంచ్ తొలుత అనుమతి ఇచ్చారు. దీంతో, రోడ్డు పనులకు స్థానిక ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి కొబ్బరి కాయ కొట్టి పనులు ప్రారంభించారు.అక్కడే అసలు సమస్య మొదలైంది. మాజీ ఎమ్మెల్యే రంగంలోకి వచ్చారు. ఇక రోడ్డు పూర్తవుతుందని భావించిన గ్రామస్థుల ఆశలను నీరు గార్చారు. సర్పంచ్, కాంట్రాక్టర్లను బెదిరించి పనులు ముందుకు సాగకుండా అడ్డుకున్నారని గ్రామస్తులు మండిపడుతున్నారు.
ఎన్నికల వేళ వివాదాస్పదం: ఆ గ్రామానికి రోడ్డు వస్తే గ్రామస్తులు తనకు ఎక్కడ దూరమవుతారో అని ఆ మాజీ ఎమ్మెల్యేలో ఆందోళన కనిపిస్తోంది. దీంతో, ఆ మాజీ ఎమ్మెల్యే పైన గ్రామస్థులు రగిలిపోతున్నారు.సర్పంచ్ తీర్మానం చేయకుండా అడ్డంకులు సృష్టిస్తూ బిల్లులు రావని బెదిరింపులకు దిగుతున్నారు. మొత్తానికి కొందరి నేతల వల్ల ఈ గ్రామం అభివృద్ధికి దూరమవుతోందని గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడు ఎన్నికల సమయంలో ఈ మాజీ ఎమ్మెల్యే తీరు వివాదస్పదంగా మారుతోంది. ఆర్నాడ లో ఈ ఘటన ఇప్పుడు మన్యం జిల్లాలో చర్చనీయాంశంగా మారుతోంది.












Click it and Unblock the Notifications