రోజా సస్పెన్షన్పై బాబు ట్విస్ట్, జగన్ హెచ్చరిక: తప్పొప్పుకుంటూ '212' ఆయుధం
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా వ్యవహారంలో ట్విస్టుల మీద ట్విస్టులు కొనసాగుతున్నాయి. రోజాను ఏడాది పాటు సస్పెండ్ చేయడం సరికాదని వైసిపి సభ్యులు చెబుతున్నారు. శాసన సభ నిబంధనల ప్రకారమే చేశామని అధికార పార్టీ చెబుతోంది.
తన ఏడాది సస్పెన్షన్ పైన రోజా హైకోర్టు, ఆ తర్వాత సుప్రీం కోర్టు.. సుప్రీం ఆదేశాలతో నేడు (గురువారం) హైకోర్టు బెంచ్ ఆదేశాల నేపథ్యంలో.. ప్రభుత్వం తదుపరి చర్యలకు కసరత్తు చేస్తోంది. హైకోర్టులో రోజాకు అనుకూలంగా తీర్పు వచ్చింది. దీనిపై డివిజన్ బెంచ్కు వెళ్లాలని ప్రభుత్వం భావిస్తోంది.
అసెంబ్లీ కార్యదర్శి శాసన సభ అధికారాలను కోర్టు దృష్టికి తీసుకు వెళ్లనున్నారు. తీర్పును గౌరవిస్తూనే రూల్ 212ను కోర్టు దృష్టికి తీసుకు వెళ్లనన్నారని తెలుస్తోంది. శాసన వ్యవస్థలో న్యాయస్థానాల జోక్యం పైన అఫ్పీల్ చేయనున్నారని తెలుస్తోంది. న్యాయవ్యవస్థలో పొరపాటు దొర్లినా న్యాయవ్యవస్థ జోక్యం తగదని చెప్పనుందని తెలుస్తోంది.
మరికాసేపట్లో ప్రభుత్వం డివిజన్ బెంచ్లో ఈ మేరకు పిటిషన్ దాఖలు చేయనున్నట్లుగా తెలుస్తోంది. 212 నిబంధన ప్రకారం అసెంబ్లీ నిర్ణయాలను కోర్టులు తప్పుబట్టలేవన్న వాదనను ప్రభుత్వం ప్రస్తావించనుంది. అంతేకాక ప్రోసీజరల్ మిస్టేక్స్ను ఆధారం చేసుకుని సభ తీసుకున్న నిర్ణయాన్ని కోర్టులు ప్రశ్నించజాలవని కూడా ప్రభుత్వం కాస్తంత గట్టిగానే తన వాదనలను సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
మరోవైపు, రోజాను సభకు రాకుండా అడ్డుకునేందుకు ప్రభుత్వం మార్షల్స్ను ఉంచింది. రోజాను అడ్డుకుంటామని అధికార పార్టీ చెప్పడం, మరోవైపు, అడ్డుకుంటే సహించేది లేదని వైసిపి అధినేత జగన్ హెచ్చరికల నేపథ్యంలో శాసన సభ ప్రాంగణంలో ఎప్పుడేం జరుగుతుందో అనే ఉత్కంఠ నెలకొంది. అయితే ఎలాంటి పరిణామాలు ఎదురైనా వాటిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు పోలీసులు కూడా పక్కా పథకాలు రచించారు.