'టీడీపీ నేతలు ఇరుక్కున్నప్పుడే పవన్ తెరపైకి.. ప్యాకేజీ కళ్యాణ్గా మారిపోయాడు'
ఏపీ సీఎం చంద్రబాబుకు పవన్ దళారీలా వ్యవహరిస్తున్నారని రోజా తీవ్రంగా విమర్శించారు. పవన్ ను ప్యాకేజీ కళ్యాణ్, కాసుల కళ్యాణ్గా అభివర్ణించారు.
అమరావతి: 2019ఎన్నికల్లో పోటీ చేస్తానని పవన్ క్లారిటీ ఇచ్చేయడంతో.. ఎన్నికల వేళ ఓట్ల చీలికలు తప్పవన్న విషయం స్పష్టమవుతోంది. పవన్ పోటీతో అధికార పార్టీ కన్నా ప్రతిపక్షం వైసీపీ ఎక్కువ నష్టపోయే అవకాశం ఉండటంతో.. పవన్ చర్యలను ఆ పార్టీ ఎప్పటికప్పుడు వ్యతిరేకిస్తోంది. తాజాగా వైసీపీ ఎమ్మెల్యే రోజా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తీరును తప్పుపడుతూ పలు వ్యాఖ్యలు చేశారు.
ఏపీ సీఎం చంద్రబాబుకు పవన్ దళారీలా వ్యవహరిస్తున్నారని రోజా తీవ్రంగా విమర్శించారు. పవన్ ను ప్యాకేజీ కళ్యాణ్, కాసుల కళ్యాణ్గా అభివర్ణించారు. టీడీపీ చేతిలో పవన్ కళ్యాణ్ ఓ పావులా మారిపోయారని అన్నారు. వైసీపీ ఏ సమస్యపై పోరాడినా.. టీడీపీ వెంటనే పవన్ రంగంలోకి దించుతోందని విమర్శించారు. ఏపీ ప్రజల సమస్యలపై జగన్ పోరాడుతున్నారని, కానీ ప్రశ్నిస్తున్నానంటూ రాజకీయాల్లోకి వచ్చిన రోజాకు ప్రజా సమస్యల పట్ల చిత్తశుద్ది లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
టీడీపీ నేతలు కేసుల్లో ఇరుక్కునే ప్రమాదం వచ్చినప్పుడే పవన్ కళ్యాణ్ ప్రత్యక్షమవుతున్నారని రోజా ఎద్దేవా చేశారు. మొగల్తూరు ఆక్వా ఫ్యాక్టరీలో ఐదుగురు వ్యక్తులు చనిపోతే, కంపెనీ యాజమాన్యానికి ఏపీ సీఎం చంద్రబాబు మద్దతు పలుకుతున్నారని మండిపడ్డారు. ఆక్వా పరిశ్రమలను సముద్ర తీరానికి తరలించాలని, ఒకవేళ తుందుర్రులో గనుక ఆక్వా పరిశ్రమ ఏర్పాటు చేస్తే ఇటువంటి ప్రమాదాలు మళ్లీ జరగవచ్చునని ఆరోపించారు.

ఇక సీఎం చంద్రబాబు గురించి ప్రస్తావిస్తూ.. ఆయన శవ రాజకీయాలు చేస్తున్నారని రోజా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. భూమా నాగిరెడ్డి చితిమంటలు కూడా ఆరకముందే.. ఆయన కుమార్తె అఖిలప్రియను అసెంబ్లీకి తీసుకొచ్చి శవరాజకీయాలకు పాల్పడ్డారని అన్నారు. భూమా అంత్యక్రియలు సాయంత్రం4గం.కు జరిగితే, అదే రాత్రి అఖిలప్రియను ఆళ్లగడ్డ నుంచి విజయవాడకు బలవంతంగా తీసుకువచ్చారని పేర్కొన్నారు.
టీడీపీ నేతలు చేస్తోన్న రాజకీయాలను ప్రజలు గమనిస్తూనే ఉన్నారని, అసెంబ్లీలో దిగుజారుడు రాజకీయాలు చేస్తున్నారని రోజా విమర్శించారు. భూమా నాగిరెడ్డి మృతికి చంద్రబాబే కారణమని ఆరోపించారు.












Click it and Unblock the Notifications