ఆ కేసుల్లో ముద్దాయిలపై రౌడీషీట్లు...బాలికలను వేధిస్తే ఉద్యోగాలు ఔట్:ఎస్పీ రవిప్రకాశ్
పశ్చిమ గోదావరి :ఫోక్సో కేసుల్లో ముద్దాయిలుగా ఉన్న వారిపై రౌడీషీట్ తెరిచేందుకు రంగం సిద్ధం చేస్తున్నామని పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ రవిప్రకాష్ సంచలన ప్రకటన చేశారు. ఇకమీదట బాలికలపై అత్యాచారాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.
అలాగే ప్రభుత్వ, ప్రైవేటు శాఖలో పనిచేసే ఉద్యోగులు తమ ఉద్యోగాన్ని అడ్డుపెట్టుకొని మైనర్ బాలికలపై అత్యాచారాలకు, లైంగిక వేధింపులకు పాల్పడితే...వారిపై రెండవసారి కూడా కేసు నమోదు అయితే...వారిని పూర్తిగా విధుల నుంచి తొలగించేందుకు చర్యలు తీసుకునే విధంగా హోం మంత్రిత్వ శాఖ పర్సనల్ సెక్రెటరీ నుండి ఉత్తర్వులు జారీ అయినట్లు ఎస్పీ రవిప్రకాష్ ఈ సందర్భంగా వెల్లడించారు.
సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జరిగిన '' మీ కోసం '' కార్యక్రమం సందర్భంగా ఎస్పీ రవిప్రకాష్ ఈ విషయాలు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో భాగంగా తొలుత ఫిర్యాదుదారుల నుండి జిల్లా ఎస్పీ ఎం.రవి ప్రకాష్ నేరుగా ఫిర్యాదులను స్వీకరించారు. వారి సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు.
బాధితులు ఇచ్చిన ఫిర్యాదులపై సంబంధిత డీఎస్పీ లతో ఆయన నేరుగా ఫోన్లో సంభాషించి దిశానిర్దేశం చేశారు. ఫిర్యాదులపై వెంటనే చర్యలు తీసుకుని వారి సమస్యలు పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు.
అనంతరం ఆయన విలేకరుల మాట్లాడుతూ వర్షాల కారణంగా జిల్లాలో ముంపుకు గురైన పలు ప్రాంతాల్లో పర్యటించి...తగిన భద్రతా చర్యలు తీసుకున్నామని చెప్పారు. అలాగే జిల్లాలో ఉమన్ ట్రాఫికింగ్ జాడలు ఉన్నాయని...ప్రస్తుతం నర్సాపురం ,పాలకొల్లు ,చింతలపూడి, జంగారెడ్డిగూడెంలలో మానవ అక్రమ రవాణా అవుతున్నట్లు సమాచారం అందిందని తెలిపారు. వీటిని నివారించేందుకు జిల్లా కేంద్రంలో ఇప్పటికే మానవ అక్రమ రవాణా వ్యతిరేక విభాగాన్ని ప్రారంభించామని ఎస్పీ రవిప్రకాష్ చెప్పారు.