ఏపీ కొత్త డీజీపీగా ఆర్పీ ఠాకూర్: మాలకొండయ్యకు వీడ్కోలు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా ఆర్పీ ఠాకూర్ నియమితులయ్యారు. ఆర్పీ ఠాకూర్ను శనివారం ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఏసీబీ డీజీగా ఆర్పీ ఠాకూర్ పనిచేస్తున్నారు. ఆయన పూర్తి పేరు రామ్ ప్రవేశ్ ఠాకూర్.
ఠాకూర్తోపాటు విజయవాడ పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్ కూడా చివరి వరకు రేసులో ఉన్నారు. చివరకు ఆర్పీ ఠాకూర్ వైపే ప్రభుత్వం మొగ్గుచూపింది. ఆర్పీ ఠాకూర్ 1986 బ్యాచ్కు చెందిన ఐపీఎస్ అధికారి. 1986, డిసెంబర్ 19న జాతీయ పోలీస్ అకాడమీలో అదనపు ఎస్పీగా ఆయన తొలి నియామకం జరిగింది.

పాట్నాలో సీఐఎస్ఎఫ్ డీఐజీగా బాధ్యతలు నిర్వహించారు. ఆ తర్వాత ఉమ్మడి ఏపీలో ఆయన కీలక బాధ్యతలు నిర్వహించారు. గుంటూరు, వరంగల్లో ఏఎస్పీగా బాధ్యతలు నిర్వహించారు. విభజన తర్వాత ఏపీ విజిలెన్స్ డీజీగా పనిచేశారు. అనంతపురం, చిత్తూరు డీఐజీగా కూడా పనిచేశారు.
2016, నవంబర్ 19న ఏసీబీ డీజీగా ఆర్పీ ఠాకూర్ బాధ్యతలను స్వీకరించారు. 2011లో ఆయన రాష్ట్రపతి చేతుల మీదుగా మెడల్ కూడా అందుకున్నారు. ఐఐటీ కాన్పూర్లో బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ చేసిన ఠాకూర్కు.. నిజాయితీల గల అధికారిగా పేరుంది.

మాలకొండయ్యకు వీడ్కోలు
ఏపీ రాష్ట్ర డీజీపీ మాలకొండయ్య వీడ్కోలు పరేడ్ ఘనంగా నిర్వహించారు. గుంటూరు జిల్లా మంగళగిరి 6వ బెటాలియన్లోని కవాతు మైదానంలో ఏర్పాటు చేసిన పరేడ్లో 8 బెటాలియన్ల సిబ్బంది పాల్గొన్నారు. వీరి నుంచి మాలకొండయ్య గౌరవ వందనం స్వీకరించారు.
అనంతరం డీజీపీ మాట్లాడుతూ ఆరు నెలలో కాలంలో రాష్ట్రంలో శాంతి భద్రతలు పరిరక్షించడం, రహదారి ప్రమాదాలు తగ్గించడం సంతృప్తినిచ్చాయన్నారు. విధి నిర్వహణలో మెరుగైన సేవలందించేందుకు సీనియర్ల సలహాలు, సూచనలు తీసుకోవాలని.. అప్పుడే విజయం సాధించగలుగుతామన్నారు.
గతంతో పోల్చితే రాష్ట్రంలో మావోయిస్టుల ప్రభావం, వైట్ కాలర్ నేరాలు తగ్గాయని మాలకొండయ్య చెప్పారు. ప్రస్తుతం సిబ్బంది పెరిగిన నేపథ్యంలో ప్రజలకు మరింత సేవ చేయాలని సూచించారు. నేరాల అదుపు విషయంలో డీజీపీ మాలకొండయ్య చక్కగా విధులు నిర్వహించారని విజయవాడ పోలీస్ కమిషనర్ గౌతం సవాంగ్ కొనియాడారు. హోమ్ గార్డు నుంచి ఉన్నతాధికారుల వరకు మాలకొండయ్య ఆదర్శంగా నిలిచారని ఏసీబీ డీజీ ఆర్పీ ఠాకూర్ తెలిపారు.












Click it and Unblock the Notifications