శ్రీవారి భక్తులకు షాక్: రూ.50 సుదర్శనం టికెట్లు రద్దు చేసిన టీటీడీ
తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) శ్రీవారి భక్తులకు మరో షాకిచ్చింది. ఎన్నో ఏళ్లుగా సాధారణ భక్తులకు అందుబాటులో ఉన్న రూ.50 సుదర్శనం టికెట్లను రద్దు చేసింది.
తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) శ్రీవారి భక్తులకు మరో షాకిచ్చింది. ఎన్నో ఏళ్లుగా సాధారణ భక్తులకు అందుబాటులో ఉన్న రూ.50 సుదర్శనం టికెట్లను రద్దు చేసింది. విడతలవారీగా ఈ టికెట్ల కోటాను తగ్గిస్తూ వచ్చిన టీటీడీ.. ఏప్రిల్ 1 నుంచి పూర్తిస్థాయిలో రద్దు చేసింది.
మధ్యతరగతి భక్తుల కోసం..
శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చే మధ్యతరగతి భక్తులను దృష్టిలో పెట్టుకుని గత ఈవో రమణాచారి రూ.50 సుదర్శన దర్శనాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ-దర్శన కౌంటర్ల ద్వారా టికెట్లను కేటాయించేవారు. దాదాపు 50 శాతానికిపైగా ఈ టికెట్లను పొందిన మధ్యతరగతి భక్తులు శ్రీవారిని శ్రీఘ్రంగా దర్శించుకుంటున్నారు.
కోత మొదలు..
అప్పట్లో వైకుంఠం క్యూకాంప్లెక్స్లో ఈ భక్తులకు మాత్రమే 8 కంపార్లుమెంట్లను కేటాయించారు. ఆతర్వాత ఈవోగా వచ్చిన ఐవైఆర్ కృష్ణారావు రూ.300 శీఘ్రదర్శనం విధానాన్ని అమలు చేశారు. దీంతో రూ.50 సుదర్శనం టికెట్ల కేటాయింపులో కోత విధించారు.
రూ.300 టికెట్ల పెంపు..
ఆ తర్వాత ఈవోగా పనిచేసిన గోపాల్.. రూ.300 ఆన్లైన్ ప్రత్యేక దర్శన విధానానికి శ్రీకారం చుట్టారు. క్యూలైనలో నిరీక్షణ లేకుండా ఇంటర్నెట్ ద్వారా బుక్ చేసుకున్న సమయాల్లో శ్రీవారిని దర్శించుకునే చర్యలు తీసుకోవడంతోపాటు కోటాను భారీగా పెంచారు.
సాధారణ భక్తులకు షాకే..
ఈ క్రమంలో రూ.50 సుదర్శన టికెట్ల కేటాయింపు తగ్గుతూ వచ్చింది. ఆన్లైన్ దర్శన విధానానికి మంచి స్పందన లభిస్తుండటంతో సుదర్శన టికెట్లను సోమ, మంగళ, బుధవారాల్లో(వారానికి 3 రోజులు) మాత్రమే మంజూరు చేయడం ప్రారంభించారు. ఇక ఏప్రిల్ 1 నుంచి రూ.50 సుదర్శన టికెట్లను పూర్తిగా రద్దు చేశారు. దీనిపై ఎలాంటి ప్రకటన కూడా చేయకపోవడం గమనార్హం. రూ.50 సుదర్శనం టికెట్ల రద్దుతో భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సాధారణ భక్తులకు ఎంతో సౌకర్యంగా ఉండే ఈ టికెట్లను రద్దు చేయడమేంటని భక్తులు మండిపడుతున్నారు.